బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం

రాజీనామా చేసే యోచనలో ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్
పొరుగుదేశం బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. దేశంలో రాజకీయ పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ నహిద్ ఇస్లామ్ను ఊటంకిస్తూ బీబీసీ బంగ్లా రిపోర్ట్ చేసింది.'యూనస్ రాజీనామా వార్త గురించి ఈ ఉదయం నుంచి మేము కూడా వింటున్నాము. ఈ విషయం గురించి చర్చించేందుకు ఆయన్ను కలవడానికి వెళ్లాను. రాజీనామా గురించే ఆలోచిస్తున్నానని యూనస్ నాతో చెప్పారు. దేశంలోని రాజకీయ పార్టీలు ఐక్యంగా లేకపోతే నేను పనిచేయలేనని ఆయన నాతో అన్నారు. దేశ భద్రత, భవిష్యత్తు కోసం బలంగా ఉండాలని నేను ఆయనకు చెప్పాను. పార్టీలన్నీ ఐక్యంగా ఉండి ఆయనకు సహకరిస్తాయని ఆశిస్తున్నా. పార్టీలకు ఆయనపై విశ్వసనీయత లేనప్పుడు యూనస్ పదవిలో ఎలా కొనసాగుతారు?' అని ఇస్లామ్ నహిద్ బీబీసీ బంగ్లాతో అన్నారు.గతేడాది బంగ్లాలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రజా ఉద్యమానికి జడసి ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం వీడారు. దీంతో రంగంలోకి దిగిన ఆర్మీ దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్గా నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ బాధ్యతలు చేపట్టారు. గతేడాది ఆగస్టు 8న ఆయన తాత్కాలిక ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
