ఖతర్లో మత ప్రచారం - ఐదుగురు తెలుగు పాస్టర్లు అరెస్ట్

ఖతర్ దేశంలో అన్యమత ప్రచారం చేశారన్న అభియోగాలతో ఐదుగురు తెలుగు పాస్టర్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడి స్థానిక చట్టాలను ఉల్లంఘించడంతో పాటు.. అధికారికంగా అనుమతులు తీసుకోకుండా మత ప్రచారం చేసినట్లు ఖతర్ అధికారులు గుర్తించారు. ఇలా అనధికారికంగా మత ప్రచారం చేసిన మొత్తం పదకొండు మందిని అరెస్ట్ చేయగా వారిలో ఐదుగురు తెలుగు క్రైస్తవ మత ప్రచారకులే ఉండటం గమనార్హం. అయితే, వీరిని దాదాపు 20 రోజుల పాటు నిర్బంధంలో ఉంచిన ఖతర్ పోలీసులు.. వీళ్లందరినీ విచారించిన అనంతరం వదిలిపెట్టినట్లు సమాచారం. అయితే, దేశం విడిచి వెళ్లిపోయేందుకు మాత్రం వాళ్లకు అనుమతి ఇవ్వలేదని అంటున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది.
ఖతర్లోని దోహాలో తుమమా అనే ప్రాంతంలో ఈ అన్యమత ప్రచారాలు చేసినట్లు చెబుతున్నారు. అక్కడి నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకోకుండానే.. మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన అక్కడి పోలీసు అధికారులు మొత్తం 11 మంది క్రైస్తవ మత ప్రచారకులను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐదుగురు పాస్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇలా అరెస్టయిన వారిలో ముగ్గురు పాస్టర్లు విజిటింగ్ వీసాలపై ఖతర్కు వచ్చి, అక్కడ మత ప్రచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాళ్లను ప్రస్తుతానికి నిర్బంధం నుంచి విముక్తి కల్పించినప్పటికీ.. దేశం నుంచి బయటకు వెళ్లేందుకు మాత్రం ప్రయాణ ఆంక్షలు కంటిన్యూ అవుతున్నాయి.
ఖతర్లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు బర్వా ప్రాంతంలో ఒక విశాలమైన, ప్రత్యేక కాంపౌండ్ నిర్మించారు. అక్కడ ఉన్న చర్చిలకు చట్టబద్ధమైన గుర్తింపు ఉంది. ఈ క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో జరిగే ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భారతదేశం నుంచి వచ్చే వాళ్లకు ఖతర్ ప్రభుత్వం ప్రత్యేకంగా విజిటింగ్ వీసాలను జారీ చేస్తుంది. అయితే, కొందరు భారతీయులు, ప్రధానంగా తెలుగువాళ్లు ఈ అధికారిక ఏర్పాట్లను కాదని ప్రైవేటు నివాస స్థలాల్లో, విల్లాల్లో అనుమతి లేకుండా ప్రార్థన కూటములు, చర్చి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇది స్థానిక చట్టాలను ఉల్లంఘించడమే అని పోలీసులు నిర్ధారించారు. చట్టబద్ధంగా అనుమతి పొందిన తెలుగు చర్చిల కంటే, ఇలా అనధికారికంగా ఏర్పాటు చేసిన ప్రార్థన స్థలాలకు ప్రజల తాకిడి ఎక్కువగా ఉండటంతో అధికారులు వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నారు.
ఖతర్ సహా గల్ఫ్ దేశాల్లో ఆయా మతాలకు చెందిన వాళ్లకు తమ మత విశ్వాసాలను ఆచరించుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి చట్టబద్ధంగా అనుమతి ఉంటుంది. అయితే, వీటిని కాకుండా.. నిబంధనలు ఉల్లంఘించి అన్యమత ప్రచారం చేయడం గానీ, అనధికారికంగా చర్చిలు వంటి ప్రార్థనా స్థలాలను నిర్వహించడం అనేది తీవ్ర నేరంగా అక్కడ పరిగణిస్తారు. ఖతర్లో గతంలో కూడా సిక్కు మతస్థులు ఓ ప్రదేశంలో అనధికారికంగా గురుద్వారా నిర్వహించిన సమయంలో, దానిని గుర్తించి నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ అనధికారిక గురుద్వారాను మూసేశారు.
