Iranian President Masoud Pezeshkian: ఇరాన్‌ అధ్యక్షుడు మసూద్‌ పెజష్కియాన్‌ ఇరాన్‌ విప్లవ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ) దళాల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఈ మేరకు ఆయన సుప్రీం లీడర్‌ అలీ ఖమేనీ కుమారుడు మొజ్తాబా ఖమేనీకి రాజీనామా లేఖ పంపినట్లు అమెరికా కేంద్రంగా నడిచే ఇరాన్‌ పత్రికలు వెల్లడించాయి.

పెజష్కియాన్‌ తన రాజీనామా లేఖలో ఇరాన్‌లో పాలనా అధికారాలు ఐఆర్‌జీసీ కమాండర్ల చేతుల్లోకి వెళ్తున్నాయని హెచ్చరించినట్లు తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన నుంచి కీలక నిర్ణయాల్లో ప్రభుత్వ అధికారులను దూరంగా ఉంచుతున్నారని, తనకు చట్టపరంగా ఉన్న అధికారాలను కూడా వినియోగించనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించినట్లు ఆ కథనాలు చెబుతున్నాయి. ఈ లేఖపై సుప్రీం లీడర్‌ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, పెండింగ్‌లో ఉంచినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ రిపోర్టులను ఇరాన్‌ అధ్యక్ష కార్యాలయం ఖండించింది. అధ్యక్ష కార్యాలయ కమ్యూనికేషన్స్‌ విభాగం డిప్యూటీ హెడ్‌ మెహదీ తబాతబాయి మాట్లాడుతూ, అమెరికాతో జరుగుతున్న చర్చల వేళ తప్పుడు సమాచారం ప్రచారం చేసి మీడియా గేమ్‌లు ఆడుతోందని ఆరోపించారు. తుర్కియే ప్రభుత్వ మీడియా కూడా ఈ ఖండనను సమర్థించింది.

ఈ నేపథ్యంలో ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి ఒప్పందం చర్చలు కూడా సంక్లిష్టంగా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌ అణ్వాయుధాల తయారీని పూర్తిగా వదిలేయాలని, హర్మూజ్‌ సమస్యపై కూడా మార్పులు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘేర్‌ కూడా దేశ హక్కులను కాపాడని ఏ ఒప్పందానికీ అంగీకరించేమని స్పష్టం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story