Sharp Criticism of Pakistan: సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌశికన్ పాకిస్థాన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓ అంతర్జాతీయ సదస్సులో పాక్ విలేకరి తమ దేశ సమస్యలకు భారత్, అఫ్గానిస్థాన్ సరిహద్దులే కారణమని చేసిన ఆరోపణలను కౌశికన్ ఖండించారు. పాకిస్థాన్ సమస్యలు బాహ్య దేశాల వల్ల కాదని, సొంత నేతలు మరియు సైన్యమే దానికి కారణమని ఘాటుగా బదులిచ్చారు. ఈ వ్యాఖ్యలు ఊరికే కాదని, వాటికి బలమైన కారణాలు ఉన్నాయని తెలిపారు.

1991 మార్చి 26న మలేషియా కౌలాలంపూర్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని నలుగురు పాకిస్థానీ ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ విమానంలో 114 మంది ప్రయాణికులు, 11 మంది సిబ్బంది ఉన్నారు. విమానం సింగపూర్ చాంగీ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఉగ్రవాదులు అందరినీ బందీలుగా చేసుకున్నారు. అప్పట్లో సింగపూర్ విదేశాంగ శాఖలో పని చేస్తున్న బిలహరి కౌశికన్ ఈ ఘటనను గుర్తు చేసుకున్నారు.

హైజాకర్లు పాక్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టోతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. బెనజీర్ అప్పుడు సింధ్‌లోని తన కుటుంబ ఎస్టేట్‌లో ఉన్నట్లు తెలియడంతో, పాకిస్థాన్ హైకమిషనర్ సాయంతో ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నించారు. అత్యవసర పరిస్థితి కావడంతో అర్ధరాత్రి 3 గంటల సమయంలో బిలహరి బెనజీర్‌కు ఫోన్ చేశారు. అయితే, అక్కడి అధికారులు ఫోన్ ఇవ్వడానికి నిరాకరించి, “మేడమ్ నిద్రపోతున్నారు, ఇప్పుడు ఆమెను డిస్టర్బ్ చేయలేము” అని చెప్పి ఫోన్ కట్ చేశారు. విమానం హైజాక్ అయిన విషయం చెప్పినా వారు పట్టించుకోలేదు.

ఈ పరిస్థితుల్లో సింగపూర్ కమాండోలు విమానం తలుపులను పేల్చి లోపలికి ప్రవేశించి, హైజాకర్లను హతమార్చి ప్రయాణికులందరినీ సురక్షితంగా విడిపించారు. తర్వాత దర్యాప్తులో హైజాకర్లు బెనజీర్ భుట్టో సొంత పార్టీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (PPP)కి చెందినవారని తేలింది. పాక్ జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడిపించాలనే డిమాండ్‌తో వారు ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడైంది.

ఈ ఘటనను ఉదహరించి బిలహరి కౌశికన్, పాకిస్థాన్ దేశంలోని సమస్యలకు సరిహద్దు దేశాలను సాకుగా చూపించడం మానేయాలని పాక్ విలేకరికి చురకలంటించారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story