పాక్ ప్రధానికి శ్రీలంక అధ్యక్షుడి ధన్యవాదాలు

IND vs PAK టీ20 వరల్డ్ కప్‌లో షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది – కొలంబోలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు అనూర కుమార దిసనాయకే


India–Pakistan Match: మొత్తానికి పాకిస్తాన్ దారి మార్చుకుంది! టీ20 వరల్డ్ కప్ 2026లో గ్రూప్ స్టేజ్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడకూడదని మొదట్లో పట్టుబట్టిన పాకిస్తాన్.. చివరికి తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఈ నిర్ణయ మార్పుకు శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకే పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 15న కొలంబోలో జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌ను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. "భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు పాక్ జట్టుకు అనుమతి ఇచ్చినందుకు థాంక్యూ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్. టీ20 క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా షెడ్యూల్ ప్రకారం కొలంబోలో జరగనున్న భారత్-పాక్ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, ఈ టోర్నమెంట్‌కు సహ-ఆతిథ్య దేశమైన శ్రీలంక తరపున ఐసీసీ ప్రయత్నాలకు కృతజ్ఞతలు తెలిపారు. 1996 ప్రపంచ కప్ సమయంలో భద్రతా కారణాలతో ఇతర దేశాలు దూరంగా ఉన్నప్పుడు భారత్, పాకిస్తాన్ జట్లు కొలంబోలో ఆడి చూపిన సంఘీభావాన్ని శ్రీలంక ఎన్నటికీ మరచిపోలేదని ఆయన గుర్తుచేశారు.

పాకిస్తాన్ ప్రభుత్వం సోమవారం తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. చర్చల ద్వారా వచ్చిన ఫలితంతో సంతృప్తి చెందడంతో పాటు, మిత్ర దేశాల విజ్ఞప్తి మేరకు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు తమ జట్టుకు అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ యథావిధిగా జరగనుంది. క్రికెట్ అభిమానులందరూ ఈ క్లాసిక్ పోటీకి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story