ట్రంప్ తో వైరం ఫలితం… 14 శాతం పతనమైన టెస్లా షేర్లు..
మస్క్కు రూ.13 లక్షల కోట్ల నష్టం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ల మధ్య స్నేహబంధం చెడిన ఫలితంగా ఎలాన్ మస్క్ వ్యాపార లావాదేవీల్లో భారీ క్షీణత నమోదయ్యింది. గత సంవత్సరం జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు సొంత డబ్బును నీళ్లలా ఖర్చు చేసిన మస్క్ ఇప్పుడు అదే ట్రంప్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఇటీవల డోజ్ శాఖ నుంచి వైదొలిగిన మస్క్.. బహిరంగంగానే ట్రంప్పై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ట్రంప్ కూడా మస్క్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు. అయితే వీరిద్దరి వైరం వల్ల మస్క్కు తీవ్ర నష్టం వాటిల్లింది. టెస్లా షేర్లు భారీగా పతనమయ్యాయి. గురువారం నాటి ట్రేడింగ్లో టెస్లా షేర్లు ఏకంగా 14శాతం పతనమయ్యాయి. దాదాపు 152 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షల కోట్లన్నమాట. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ మార్క్ను కోల్పోయి 916 బిలియన్ డాలర్లకు పడిపోయింది. టెస్లా సంపద ఒక్క రోజులోనే ఈ స్థాయిలో తరిగిపోవడం సంస్థ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికన్లకు పన్ను తగ్గించేందుకు బిగ్ ట్యాక్స్ బ్రేక్ బిల్లును ట్రంప్ యంత్రాంగం తీసుకొచ్చింది. ట్రంప్-మస్క్ మధ్య దూరానికి ఈ బిల్లే ప్రధాన కారణమని చెప్తున్నారు. ఈ బిల్లుతో ధనికులకు 4.5 లక్షల కోట్ల డాలర్ల మేర లబ్ధి చేకూరి, పేదలకు ఉద్దేశించిన సంక్షేమ పథకాలు మరుగున పడుతాయని మస్క్ తప్పుబడుతున్నారు. ఇదో అసహ్యకరమైన బిల్లుగా ఆయన అభివర్ణించారు. రుణ పరిమితిని పెంచి అమెరికా ఆర్థికాన్ని దివాలా తీయించేలా ఉన్న ఇలాంటి బిల్లుకు మద్దతిచ్చిన వారికి సిగ్గు ఉండాలని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'కిల్ ది బిల్' అంటూ ట్వీట్ చేశారు. అయితే, ఎలక్ట్రిక్ కార్లకు రాయితీ తగ్గింపు అంశం బిల్లులో ఉండటం వల్లే మస్క్ దీన్ని వ్యతిరేకిస్తున్నారని ట్రంప్ వర్గం ఎదురుదాడికి దిగుతున్నది.
