H-1B Visa Misuse: హెచ్-1బీ వీసా దుర్వినియోగంపై ట్రంప్ ప్రభుత్వం కఠిన చర్యలు.. 175 కేసుల్లో విచారణ ప్రారంభం
175 కేసుల్లో విచారణ ప్రారంభం

H-1B Visa Misuse: అమెరికాలో హెచ్-1బీ వీసా దుర్వినియోగం వల్ల అమెరికన్ యువత ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం కొత్త దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించింది. సెప్టెంబర్లో 'ప్రాజెక్ట్ ఫైర్వాల్' అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని అమెరికా కార్మిక శాఖ ప్రవేశపెట్టింది. దీని ద్వారా హెచ్-1బీ వీసా అవకతవకలపై విచారణలు చేపట్టిన శాఖ, ఇప్పటివరకు 175 కేసులను నమోదు చేసింది. ఈ విషయాన్ని అమెరికా మీడియా సంస్థలు ప్రకటించాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హెచ్-1బీ వీసా ఫీజును 1,00,000 డాలర్లకు పెంచే సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయం తర్వాతే కార్మిక శాఖ 'ప్రాజెక్ట్ ఫైర్వాల్'ను అమలు చేపట్టింది. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం, అమెరికన్ యువకులకు బదులుగా తక్కువ వేతనాలతో విదేశీ కార్మికులను నియమించుకునే కంపెనీలను నిరోధించడమే. దుర్వినియోగాలపై కార్మిక శాఖ ఆడిట్లు చేపట్టింది. "ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నామి" అని శాఖ మంత్రి లోరి చావెజ్ తెలిపారు. అయితే, ఈ విచారణల వివరాలు ఇంకా ప్రకటించలేదు. అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వంలో అధిక నైపుణ్య ఉద్యోగాలు ముందుగా అమెరికన్ కార్మికులకు అందేలా చూస్తామని శాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కార్మిక శాఖ ఇటీవల ఒక ప్రచారాత్మక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో, "హెచ్-1బీ వీసా దుర్వినియోగం వల్ల విదేశీలతో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. అమెరికన్ యువత అమెరికన్ డ్రీమ్ను కోల్పోతోంది. అధ్యక్షుడు ట్రంప్, కార్మిక శాఖ నాయకత్వంలో వీసా దుర్వినియోగం చేసే కంపెనీలపై చర్యలు తీసుకుంటున్నాం" అని పేర్కొన్నారు. వీడియోలో హెచ్-1బీ వీసాల్లో 72 శాతం భారతీయులకు అందుతున్నాయని చూపించే గ్రాఫ్ను కూడా చేర్చారు.
ఈ చర్యలు అమెరికాలో ఉద్యోగాల రక్షణకు దోహదపడతాయని ట్రంప్ ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది. భారతీయ ఐటీ కంపెనీలు, విదేశీ కార్మికులపై ఈ దర్యాప్తులు ప్రభావం చూపుతాయని అంచనా. మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.

