US President Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురువారం (ఆగస్టు 6) రెండు కొత్త ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై సంతకం చేశారు. జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌) అర్హతను పరిమితం చేయడం, అలాగే ‘బర్త్‌ టూరిజం’ను అరికట్టడం ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యం.

సుప్రీంకోర్టు జూన్‌ 30న 6-3 మెజారిటీతో ట్రంప్‌ గతంలో తీసుకున్న బర్త్‌రైట్‌ సిటిజన్‌షిప్‌ రద్దు చర్యలను రాజ్యాంగవిరుద్ధమని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును ట్రంప్‌ “చాలా దురదృష్టకరం” అని వ్యాఖ్యానించారు. “ఇది అమెరికా అంతర్యుద్ధం తర్వాత బానిసల పిల్లల కోసం తీసుకున్న చర్య. ఇప్పుడు దానిపై వ్యాపారాలు నడుపుతున్నారు” అని ఆయన అన్నారు.

కొత్త ఆదేశాల ప్రకారం విదేశీ ప్రభుత్వాల్లో పనిచేస్తూ అమెరికాలో ఉండే సిబ్బంది పిల్లలు, అలాగే గర్భిణీగా ఉండి తమ సందర్శన ఉద్దేశాన్ని దాచి వచ్చిన మహిళల పిల్లలకు జన్మతః పౌరసత్వం రాదు. అమెరికా భూభాగాల్లో పుట్టిన పిల్లల విషయంలో కాంగ్రెస్‌ ఆమోదం అవసరం.

బర్త్‌ టూరిజం అంటే ఏమిటి?

పుట్టబోయే పిల్లకు అమెరికా పౌరసత్వం కల్పించాలనే ఉద్దేశంతో గర్భిణీలు అమెరికాకు వచ్చి అక్కడ ప్రసవించడమే బర్త్‌ టూరిజం. ట్రంప్‌ దీన్ని “అవమానకరం” అని అభివర్ణించారు. “ఎవరూ దీన్ని దుర్వినియోగం చేయకూడదు. అలా జరగనివ్వం” అని స్పష్టం చేశారు.

రాజ్యాంగ నిబంధనలు

1868లో ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టినవారందరికీ (తల్లిదండ్రులు అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉన్నా) పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, శత్రు దేశాల వారి పిల్లలకు మాత్రమే మినహాయింపు ఉంది. కొత్త ఆదేశాలు అమల్లోకి వస్తే ఏటా సుమారు 2.5 లక్షల మంది పిల్లలపై ప్రభావం పడే అవకాశం ఉంది.

ఈ చర్యలు భారతీయులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికాలో ప్రసవం కోసం వెళ్లే భారతీయ మహిళల సంఖ్య గణనీయంగా ఉండటంతో ఈ కొత్త నిబంధనలు వారికి అదనపు కష్టాలు తెచ్చిపెట్టవచ్చు.

అయితే ఈ ఆదేశాలను ఎలా అమలు చేస్తారనేది ఇంకా స్పష్టంగా లేదు. న్యాయపరమైన సవాళ్లు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story