దాడి సూచనలు?

USA–Iran Tensions: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవుతున్నాయి. అమెరికా అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ (USS Abraham Lincoln) తాజాగా మధ్యప్రాంతానికి చేరుకుంది. దీంతో ఇరాన్‌పై అమెరికా ఎప్పుడైనా దాడి చేసే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరిగాయి.

అబ్రహం లింకన్‌తో పాటు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ. పీటర్సన్ జూనియర్ (USS Frank E. Petersen Jr.), యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ (USS Spruance), యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ (USS Michael Murphy) డెస్ట్రాయర్లు కూడా ఈ ప్రాంతానికి చేరాయి. అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు ఈ నౌకాదళాన్ని మోహరించినట్లు తెలిపింది. ఈ బృందం ఇరాన్ సరిహద్దులోని అరేబియా సముద్రంలో కాకుండా హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ పరిణామంతో మధ్యప్రాంతంలో అమెరికా సైనిక సిబ్బంది సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఇక పెంటగాన్ వైపు నుంచి పలు ఫైటర్ జెట్లు, మిలిటరీ కార్గో విమానాలను ఈ ప్రాంతానికి తరలిస్తున్నట్లు మీడియా నివేదికలు వెలువడుతున్నాయి. ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్ ప్రభుత్వం వారిపై ఏ చర్యలు తీసుకున్నా జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

అమెరికా చర్చలకు సిద్ధం: ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు సిద్ధమైతే అమెరికా కూడా అందుకు తెగబడుతుందని అగ్రరాజ్య అధికారి ఒకరు తెలిపారు. చర్చలు ముందుకు సాగాలంటే టెహ్రాన్ ఏ చర్యలు తీసుకోవాలో ఇప్పటికే తెలుసని ఆయన పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story