Yunus Makes Controversial Remarks Against India Again: బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడిగా మహమ్మద్ యూనస్ (Muhammad Yunus) అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి భారత్‌తో దౌత్య సంబంధాలు ఒత్తిడిలో పడ్డాయి. తాజాగా ఆయన మరోసారి భారత్‌పై విషవేషం చేశారు. పాకిస్థాన్ జెయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ షంషాద్ మీర్జాకు వివాదాస్పద మ్యాప్‌ను బహూకరించారు. ఆ మ్యాప్‌లో భారత ఈశాన్య ప్రాంతాన్ని బంగ్లాదేశ్‌లో భాగంగా చూపించారు. ఈ చర్య భారత సార్వభౌమత్వానికి విరుద్ధంగా ఉండటంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది.

పాక్ జనరల్‌కు వివాద మ్యాప్ బహూకరణ

యూనస్ అధికారం చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్-పాకిస్థాన్ సంబంధాలు దగ్గరవుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్ పర్యటించారు. ఆ సమయంలో యూనస్‌తో భేటీ అయ్యారు. అప్పుడు ‘ఆర్ట్ ఆఫ్ ట్రయంఫ్’ పేరుతోనే పుస్తకాన్ని బహూకరించారు. ఆ పుస్తకం కవర్‌పై ఉన్న మ్యాప్ వక్రీకరించబడింది. దానిలో భారతదేశానికి చెందిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు (India's Northeast) బంగ్లాదేశ్‌లో చేర్చబడ్డాయి. ఈ విషయం తెలిసిన వెంటనే నెటిజన్లు, భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనస్ చర్యలు భారత సార్వభౌమత్వాన్ని ధిక్కరిస్తున్నాయని విమర్శించారు.

ఈశాన్యపై యూనస్ అక్కసు: ముఖ్య ఘటనలు

భారత ఈశాన్య ప్రాంతంపై యూనస్ అక్కసు వెళ్లగక్కడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది చైనా పర్యటన సమయంలో ‘‘భారత ఈశాన్యలోని ఏడు రాష్ట్రాలు సెవెన్ సిస్టర్స్‌గా పిలుస్తారు. అవి బంగ్లాదేశ్‌తో భూపరివేష్టితమై ఉన్నాయి. సముద్రానికి చేరుకోవడానికి వాటికి మరో మార్గం లేదు. మేమే వారి రక్షకులం. ఇది భారీ అవకాశం. చైనా ఆర్థిక విస్తరణకు సహాయపడుతుంది’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరోసారి బంగ్లాదేశ్, నేపాల్, ఈశాన్య రాష్ట్రాలకు సమగ్ర ఆర్థిక సమైక్యతా ప్రణాళిక అవసరమని చెప్పారు (Bangladesh-Pakistan).

ఈ వ్యాఖ్యలకు భారత్ తక్షణమే గట్టి బదులు ఇచ్చింది. విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ మాట్లాడుతూ, ‘‘బంగాళాఖాతంలో భారత్‌కు 6,500 కి.మీ. తీరరేఖ ఉంది. మా ఈశాన్య ప్రాంతం బిమ్‌స్టెక్ కనెక్టివిటీ హబ్‌గా మారుతోంది. రోడ్లు, రైల్వేలు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైప్‌లైన్‌లతో పసిఫిక్ మహాసముద్రం వరకు అనుసంధానం అవుతోంది. ఇది నిజమైన గేమ్ చేంజర్’’ అని స్పష్టం చేశారు.

యూనస్ చర్యలు భారత-బంగ్లా సంబంధాలను మరింత దెబ్బతీస్తాయని విశ్లేషకులు అంచనా. భారత్ దౌత్య మార్గాల ద్వారా ఈ అంశాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

Next Story