తెలంగాణలో రియల్ ఎస్టేట్ వృద్ధితో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. ప్రభుత్వ విలువకు, మార్కెట్ ధరలకు వ్యత్యాసం భారీగా ఉండటంతో సర్కార్ ఆదాయానికి భారీగా గండి పడుతోందనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీంతో ఈ వ్యత్యాసాన్ని తగ్గించి, భూలావాదేవీల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు భూముల మార్కెట్ విలువలను సవరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో మార్కెట్ విలువల కేంద్ర మధింపు సలహా కమిటీ దీనిపై చర్చించింది. ప్రైవేట్ ఏజెన్సీ నివేదిక ఆధారంగా, పెంపు శాస్త్రీయంగా ఉండాలని సూచించారు. త్వరలోనే పెంపుపై తుది నిర్ణయం వెలువడనుంది.తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే మారు మూల పల్లెల్లోనూ ఎకరం లక్షల్లో పలుకుతుండగా.. ప్రభుత్వ రికార్డుల్లోని వాటి విలువలు తక్కువగా ఉంటుంది. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది.

భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ వాల్యూ మధ్య వ్యత్యాసాన్ని తగ్గించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. భూముల మార్కెట్ విలువలను పెంచేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన వనరుల సమీకరణ సమావేశంలో భూముల విలువ పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు సూచించారు. దీనితో రాష్ట్ర స్థాయిలో మార్కెట్ విలువల కేంద్ర మదింపు సలహా కమిటీ సమావేశమై ఈ అంశంపై చర్చించింది. గతంలోనే ఒక ప్రైవేట్ ఏజెన్సీతో భూముల విలువ పెంపుపై అధ్యయనం చేయించిన ప్రభుత్వం, ఆ నివేదిక ఆధారంగా ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించాలని రిజిస్ట్రేషన్ శాఖకు సూచించింది. పలు దఫాలు సమావేశమైన అధికారులు తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదించారు. రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ విలువ పెంపుపై త్వరలోనే నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.

తాజాగా భూముల విలువ పెంపుపై నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రేషన్ శాఖను ప్రభుత్వం కోరడంతో పెంపు ఖాయమనే చర్చ జరుగుతోంది. రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ చైర్మన్గా, జాయింట్ ఐజీ కన్వీనర్గా వ్యవహరించే లో సీసీఎల్ఏ కార్యదర్శి, ఇతర శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ భూముల మార్కెట్ విలువలను సమీక్షించి, అవసరమైన సిఫార్సులతో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. మంగళవారం రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో సీవీఏసీ సమావేశమై మార్కెట్ విలువలపై చర్చించింది. త్వరలో మరోసారి సమావేశమై పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. భూముల విలువలను ఎంత పెంచాలనేది ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని, అయితే ఈ పెంపు శాస్త్రీయంగా ఉండాలని థర్డ్ పార్టీ ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది.అధికారులు తయారు చేసిన నివేదిక శాస్త్రీయంగా ఉందా, భూముల వాస్తవ ధరలకు, పుస్తక విలువలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఎంత, దానిని సవరించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, శాస్త్రీయంగా పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు వంటి అంశాలపై ఏజెన్సీ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఈ నిర్ణయం ప్రభుత్వానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చడమే కాకుండా.. భూముల మార్కెట్ విలువలను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తీసుకురావడంలో సహాయపడతాయని అధికారులు భావిస్తున్నారు.

Updated On 23 May 2025 1:57 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story