తెలంగాణ సాయుధ పోరాటంలో అబద్దాలు... అక్షర సత్యాలు
విశాలాంధ్ర ముసుగు తొడిగి అబద్ధాలు ప్రచారం చేశారు

ప్రాంతీయ తేడాలు లేకుండా తెలంగాణ పోరాటం తెలుగు ప్రజలందరి పోరాటంగా విశాలాంధ్ర కమ్యునిస్టు కమిటీ నాయకత్వంలో జరిగిందని అబద్ధాల్ని అక్షరబద్ధం చేస్తున్నారు. ఈ పోరాటంలో వీర తెలంగాణ రైతాంగమూ, ఈ రైతాంగ ప్రజల తిరుగుబాటుకు నాయకత్వం వహించే బాధ్యతను స్వీకరించిన కమ్యూనిస్టు పార్టీ విశాలాంధ్ర రాష్ట్ర శాఖ అనుపమ త్యాగాలు చేశాయి అని వీర తెలంగాణ విప్లవ పోరాటం -గుణపాఠాలు పుస్తకం ఉపోద్ఘాతంలోనే పుచ్చలపల్లి సుందరయ్య పేర్కొన్నారు. త్యాగాలు తెలంగాణవి పేరు విశాలాంధ్రది. భూస్వాముల దోపిడికి వ్యతిరేకంగా, భూమి కోసం గుత్పల సంఘం’గా ప్రసిద్ధి చెందిన వామపక్ష భావాలు గల ఆంధ్రమహాసభ తరపున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్మితమయింది.
ఇది వాస్తవం. అయితే దీనికి విశాలాంధ్ర ముసుగు తొడిగి అబద్ధాలు ప్రచారం చేశారు. తాము ఎవరినైతే ప్రస్తుతం నాజీ, నియంత,నిరంకుశుడు, రాక్షసుడు అని నిందిస్తున్నారో ఆ ఏడో నిజాం మీర్ ఉస్మానలీఖాన్ ప్రభుత్వంతో కమ్యూనిస్టులు మిలాఖత్ కాలేదా? కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఏర్పడ్డ కేంద్ర (నెహ్రూ) ప్రభుత్వం బూర్జువా, పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాస్తున్నదనీ దాన్ని కూలదోయాలనీ కమ్యూనిస్టులు పిలుపివ్వలేదా? మఖ్దుమ్ మొహియుద్దిన్, రావి నారాయణరెడ్డిలు మే నాలుగు 1948న నిజాం ప్రధాని లాయక్ అలీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమ్యునిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే కాకుండా, మఖ్దూమ్ మరో ఐదుగురు కమ్యునిస్టు నాయకుల పైన ఉన్న వారంట్లను కూడా నిజాం ప్రభుత్వం ఎత్తివేయడం నిజం కాదా? దీంతో రజాకార్లను కమ్యునిస్టులు ప్రజా సైన్యంగా అభివర్ణించారు.కమ్యునిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ ఈ సమయంలో ఒక తీర్మానం చేసి, ఎనిమిది పేజీల కరపత్రాన్ని కూడా ప్రచురించింది. నిజాం రాష్ట్రం భారత యూనియన్లో చేరకూడదు. నెహ్రూ ప్రభుత్వం ధనిక వర్గ ప్రభుత్వం. పెట్టుబడి దారీ దోపిడిని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశ్యంతో సంస్థానాలను బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి అని అందులో పార్టీ పేర్కొంది. అంత వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ బహదుర్ గౌర్ హష్మతు గంజ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి, అది కమ్యునిస్టు పార్టీ విధానం అని ప్రకటించాడు. ఇవీ నిజాలు. ఈ చేదు నిజాలు ఎత్తుగడలో భాగంగా భావిస్తే రావి, మఖ్దూం, గౌర్ గౌరవాలకు ఎలాంటి లోటూ రాదు. 1948కి ముందు, ఆ తర్వాత వారు చేసిన త్యాగాలు చిన్నవేమి కావు. ఈ నిజాలకు ఇన్ని రోజులు పట్టిన బూజు వదలగొట్టాలని చూస్తే నిజాంపై మోజు అంటూ వెక్కిరిస్తున్నారు.
నిజాం రాజు జన్మ జన్మాల బూజు అన్న దాశరథి కృష్ణమాచార్యని పదే పదే వల్లిస్తున్నారు. అదే దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కూడా అన్నాడు. అది మాత్రం గుర్తుకురాదు. రైతాంగ సాయుధ పోరాటంలో నిమగ్నమై ప్రాణాలను పణంగా పెట్టి ఉద్యమాన్ని నడిపిస్తున్న భీమిరెడ్డి నరసింహా రెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులకు తెలియకుండానే, పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్య పోరాట విరమణ ప్రకటించారు. ఈ ఇద్దరూ సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనలేదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి, పోరాటం అండతో గెలిచారు. ఇదీ కమ్యునిస్టుల నిజ స్వరూపం. చరిత్ర ఇలా ఉంటే పోరాటం ముగిసిన పాతికేండ్ల తర్వాత తమకు అనుకూలమైన రీతిలో చరిత్రను వక్రీకరించి గ్రంథస్థం చేసి, అదే ప్రామాణికమైనదని బాకాలూదు తున్నారు. నిజాంని నెత్తికెత్తుకోకుండా, అణగదొక్కకుండా తిన్నగా నిలబెట్టి అంచనా వేయలేమా? ఇజాలు కప్పేసిన బూజు దులిపి నిజాలను చూడలేమా?
నిజాం జమానాలో ఇప్పటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కన్నా కొన్ని వందల రెట్లు మెరుగ్గా ఉన్న అంశాలను స్మరించుకుంటే తప్పేమిటి? తెలంగాణ తల్లి వాసనలు పట్టిచ్చే చార్మినార్ని హైదరాబాద్కు ప్రతీకగా కాకుండా హైటెక్ సిటీని చూపిస్తే ఎట్లా మనసొప్పుతుంది? అద్వానీ తాను పుట్టిన పాకిస్థాన్ వెళ్ళి జిన్నా సమాధిని సందర్శిస్తే చప్పుడు చేయని బిజెపి వారు కెసిఆర్ నిజాం సమాధికి నివాళి అర్పిస్తే నెత్తీ నోరూ మొత్తుకుంటున్నారు. నిజాం స్థాపించిన ఫ్యాక్టరీలు, చేసిన అభివృద్ధిని గుర్తిస్తూనే అవేమైనా ఇంటినుంచి తెచ్చాడా? తెలంగాణ ప్రజల చెమట, రక్త మాంసాలు అంటున్నారు. ఔను, ఒప్పుకుందాం. ఏ రాజైనా ఇంటినుంచి పైస తెచ్చి పబ్లిక్కు పెట్టిన చరిత్రుందా? శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులకు పన్ను ద్వారా కాకుండా పైకం ఎక్కడ్నించి వచ్చేది? అది కూడా ప్రజల రక్తమాంసాలే కద. మరి వాళ్లకు దక్కిన కీర్తి ప్రచారంలో నిజాంకు కొంతైనా ఎందుకు దక్కకూడదు? వాళ్లు ప్రజలను పీడించకుండా పన్నులు వసూలు చేసేవారని చెపుతున్నారు.
నిజాం ప్రభుత్వంలో కూడా రెండో ప్రపంచ యుద్ధం ముందు పీడన దౌర్జన్యం తక్కువే. వెట్టి చాకిరిపై నిషేధం ఉండేది. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో భూమయ్య, కిష్టాగౌడ్ని ఉరితీస్తే ఆనాటి నిజాం ప్రభుత్వం ఉరిశిక్షను రద్దు చేసింది. జ్యూడిషియరీ, ఎగ్జిక్యూటివ్ని వేరు చేసిన మొట్టమొదటి సంస్థానం హైదరాబాద్. నిజాం సాగర్, పోచంపాడు, వైరా, పాలేరు ప్రాజెక్టు, రాజోలిబండ, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ మొదలైన వేల కొలది చెరువులు, కుంటలు, నీటి వసతులు నిజాం కాలంలోనే పూర్తయినయి. నిజాం ప్రాంతంలో నడిచే రైల్వేలను నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే పేరిట ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీనికి అనుబంధంగా 1932లో ఆర్టీసి వ్యవస్థను దేశంలోనే మొట్టమొదటి సారిగా ప్రవేశ పెట్టింది నిజామే. హైదరాబాద్ సివిల్ సర్వీస్ పద్ధతిని ప్రవేశపెట్టాడు. దేశ భాషల్లో బోధించే మొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీని స్థాపించాడు. ఇప్పుడు ఉర్దూని ముస్లిముల భాషగా చూస్తున్నారు గానీ అప్పుడు ఉర్దూ అందరి భాష.
వైద్యంలో అన్ని స్పెషలైజేషన్ దవఖానాలు (ఆసుపత్రులు) హైదరాబాద్లో ఉండేవి. షాబాద్ సిమెంట్, సిర్పూర్ మిల్స్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ, డి.బి.ఆర్. మిల్స్, ఆజాంజాహీ మిల్స్, మోజంజాహీ మార్కెట్, సింగరేణి అన్నీ అప్పుడు ప్రారంభమైనవే. గల్లి గల్లిల నల్లలుండేవి. అందరికీ ఫ్రీగా నీళ్ళందేవి. నిజాం కా నల్లా చౌబీస్ గంటా కుల్లా అని అప్పట్లో అనుకునేవారు. ఇప్పుడేమో నల్ల బిల్లు కట్టకుంటే మోరీ (డ్రైనేజ్)లు మూస్తామంటున్నారు. అరవై యేళ్ళుగా ఊదరగొడుతున్న విషయాలన్నీ ఒక్క క్షణంలో అబద్ధాలని తేలితే వాటిని జీర్ణించుకోవడానికి కొంచెం సమయం పడుతుంది. నిజాల్ని సావధానంగా అవలోకిస్తే నిజాంను సరిగ్గా అంచనా వేయగలం. హైకోర్టు నిర్మాణ సమయంలో ఒక మూలన ఉన్న చిన్న మందిరాన్ని అక్కడినుంచి తరలించి వేరే దగ్గర నిర్మిస్తామని అధికారులు సూచించగా, దానికి నిజాం సమ్మతించలేదు. మందిరాన్ని అక్కడి నుంచి తరలించడమంటే అన్యాయపు పునాదులపై న్యాయాలయాన్ని నిర్మించినట్లు అవుతుందని అన్నారు.
హిందూ దేవాలయాలైన అజంతా గుహల పరిరక్షణ కోసం ఇటలీ నుంచి ప్రత్యేకంగా ప్రొఫెసర్ సెక్కొనీ, ఒర్సినిలను పిలిపించి 1915లోనే దాదాపు 30 లక్షలు వెచ్చించి వాటిని కాపాడిన తీరు గుర్తింపుకు నోచుకోలేదు. అలాగే ఆంధ్ర మహాసభ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని డిమాండ్ చేశాయి తప్ప కొంత మంది ప్రచారం చేస్తున్నట్టుగా నిజాంకు వ్యతిరేకంగా కాదు. అలాగే సురవరం ప్రతాపరెడ్డి నిజాంకు వ్యతిరేకమైనప్పటికీ తాను ప్రకటించిన గోలుకొండ కవుల సంచికలో నిజాంని కీర్తిస్తూ వచ్చిన కవితలకు స్థానం కల్పించాడు. శేషాద్రి రమణ కవులు నైజాం రాష్ట్ర ప్రశంస అనే పుస్తకాన్ని వెలువరించారు. 1938-1948 మధ్య కాలంలో ఆయన చేసిన పనికి (చెయ్యాల్సిన పని చెయ్యకుండా ఉన్నందుకు) తెలంగాణ ప్రజలు చెల్లించిన మూల్యాన్ని లెక్కగట్టలేము. రెవెన్యూ, పోలీసు, అబ్కారీ అంతా బ్రిటీషధికారుల చేతిలో ఉండేది. ఆయా శాఖలను నిజాం ప్రభుత్వం సరిగ్గా నియంత్రించలేకపోవడంతో వారి ఇష్టా రాజ్యమై ప్రజలు కష్టాల పాలయ్యారు.
దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్లు, సంస్థానాధీశులు, రజాకార్లు వడిగట్టిన దుర్మార్గాలకు ఒక్క నిజాంనే ద్రోహిగా చిత్రించడం విడ్డూరం. ఈ దేశ్ముఖ్లు, జాగీర్దార్లు, జమిందార్లే 1952 ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయి తమ దోపిడిని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. నాయకులయ్యే సరికి వారి పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తమయినట్లు వాళ్లనెవ్వరు నిలదీయడం లేదు. పోలీసు చర్య పేరిట హైదరాబాద్ని ఆక్రమించుకున్న కేంద్ర ప్రభుత్వ బలగాలు, వారితో ప్రేరేపితులైన హిందూత్వ వాదుల చేతిలో సంఖ్యానేకంగా నిజాం రాజ్య ముస్లింలు ఊచకోతకు గురయ్యారు. వారి వారసులు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఉద్యోగాలు, ఆస్తి, ఉనికి కోల్పోయి ఇప్పటికీ మూగగా రోదిస్తున్నారు. సాయుధ పోరాట యోధులవి మాత్రమే ప్రాణాలయినట్టు వారి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. మెజారిటీ తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ నిజాం ఒక ప్రతీక. ఈ విషయమై ఉర్దూ పత్రికల్లో జరుగుతున్న చర్చ చూసినట్టయితే నిజాంకు రజాకార్లకు మధ్యన ఉన్న విభజన రేఖను హిందూత్వ వాదులు చెరిపేస్తున్నారన్న భావనలో వారు ఉన్నట్టు స్పష్టమవుతుంది.
హిందువులుగా కాకుండా లౌకిక వాదులుగా ఆలోచించినట్లయితే వారి మనోభావాలు అర్థం చేసుకోగలం. బ్రిటీషధికారులైన కాటన్కు విగ్రహం, బ్రౌన్కు లైబ్రరీ కట్టి, థామస్ మన్రో పేరు పెట్టుకుని ఇప్పటికీ వాళ్లను ఆంధ్రదేశం గుర్తు పెట్టుకుంటే ఏ ఇబ్బందీ లేదు! కానీ, ఇక్కడ పుట్టి, ఇక్కడే పెరిగి, వాళ్లలాగే అంతో ఇంతో సేవ జేసిన నిజాం గురించి మాట్లాడితే చాలు నియంత, నిరంకుశుడు అంటున్నారు. ఏ విలువలకీ ప్రస్థానం? ఇప్పటికైనా తెలంగాణ చరిత్రను సరైన ఆధారాలతో నిష్పాక్షికంగా సమీక్షించుకుని సమగ్రంగా రాసుకోవాల్సిన అవసరముంది. చాలా మంది తెలుగు చరిత్రకారులకు అరబిక్, ఉర్దూ తెలియక పోవడంతో ఆ భాషలో ఉన్న కొన్ని వేల పుస్తకాల్లోని సారాంశం తె లుగు పాఠకులకు అందు బాటులోకి రాలేదు. అలాగే ఆంగ్లంలో ఉన్న సమాచారం కూడా అందరికీ తెలియరాలేదు. వీటన్నింటిని బేరీజు వేసుకుని ఎవరికి దక్కాల్సిన వాటాని వారికి న్యాయబద్ధంగా అందజేసి కక్షసాధింపుతో, పక్షపాత బుద్ధితో రాసిన చరిత్రను సవరించుకోవాలి.
గతంలో జరిగిన సంఘటనలకు ఒక్క నిజాంని మాత్రమే బాధ్యుణ్ణి చేసి ప్రచారం చేస్తున్న సంస్థలు, వ్యక్తులు ఆ సంఘటనలకు నిజాంతో పాటుగా సంస్థానాధీశులు, జాగీర్దార్లు, దేశ్ ముఖ్లు, దేశ్ పాండ్యాలు, భూస్వాములు, దొరలు కూడా సమా న బాధ్యత వహించాల్సి ఉంటుందనే విషయాన్ని ఎందుకు కావాలని విస్మరిస్తారు? బహుశా ఆయా వర్గాలు తమ మతానికి సంబంధించిన వారు కావడం మూలంగానే వదిలేస్తున్నారేమో?
1724 నుంచి 1948 వరకు 224 సంవత్సరాల ముందు 220 యేండ్లు జరిగిన సంఘటనలకు కూడా నిజాంనే బాధ్యుల్ని చేయాలి. అంటే తెలంగాణలో స్థాపించిన పరిశ్రమలకు, వైద్య, విద్యాలయాలకు, నోబెల్ ప్రయిజ్ గ్రహీత రోనాల్డ్ రాస్ పరిశోధనకు వసతులు సమకూర్చినందుకు, ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యూడిష్యరీని విడదీసి న్యాయవ్యవస్థకు దేశంలోనే మొట్టమొదటిసారి స్వయం ప్రతిపత్తి కల్పించినందుకు కూడా నిజాంని బాధ్యుణ్ణి చేయాల్సిందే! కట్టుబట్టలతో వచ్చిన నిజాం అత్యంత సంపన్నుడెట్లయ్యా డు? అని కొందరు అపరమేథావులు ప్రశ్నిస్తుంటారు...ఒక ప్రాంతానికి సుబేదారుగా నియమించబడ్డ వ్యక్తి కట్టుబట్టలతో మాత్రమే వస్తాడని ఊహించడం వారికి అసఫ్జాహీలపై ఉన్న ఏహ్య భావాన్ని వ్యక్తం చేస్తోం ది. అసఫ్ జాహీలు ప్రపంచంలోనే అత్యధిక సంపున్నులుగా ఎదగడానికి ప్రధాన కారణాలైన వజ్ర, వైఢూర్య ఆభరణాలు, సర్ఫెఖాస్ భూములు అప్పుడు ప్రభుత్వం అధీనంలోనే ఉన్నాయి. ఆ సర్ఫెఖాస్ భూములే పూర్వాంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కామధేనువులయ్యాయి.
అసఫ్ జాహీలు తమ ఆస్తుల్ని వేరే ప్రాంతాలకు తరలించలేదు. దేశ విదేశాల్లో మరెక్కడా పెట్టుబడి పెట్టలేదు. తమ ఆస్తి సంపదనంతా తెలంగాణలోనే నిక్షిప్తం జేశారు. బ్రిటి ష్ పాలకుల మాదిరిగా సంపదను తరలించలేదనే విషయాన్ని గ్రహించాలి. తనకు ఇంగ్లీషు పుస్తకాల్లో ఏమి రాస్తున్నారో తెలియదు అని ఒకవైపు ఒప్పుకుంటూనే మరో వైపు అందులో గోరంతలు కొండంతలు చేసి రాస్తున్నారనే అబద్ధాలు ప్రచారంలో పెట్టారు.
షీలారాజ్, సరోజిని రేగాని, రత్నానాయుడు, వి.కె.బావా లాంటి వందల మంది ఉర్దూ, పర్షియన్ పత్రాలను అవలోకించి వెలుగులోకి తెచ్చిన విషయాలు తెలుగువారికి అందుబాటులో లేవు. వారి పుస్తకాల్లోని విషయాలు అందరికి అందుబాటులో ఉన్నట్లయితే ఎస్వీ లాంటి వారు చేసే వాదనలు ఎంత అహేతుకమైనవో తేలుతాయి. రఫత్, కనీజ్లు అడిగినట్లుగా నిజాంని నిందించడం గాకుండా అరసం తెలంగాణ ముస్లింలకు ఏం జేసిందో, విశాలాంధ్ర ప్రచురణ సంస్థ నుంచి ఇంతవరకు తెలంగాణ ముస్లిం యోధులైన షోయెబుల్లాఖాన్, బందగీ, తుర్రేబాజ్ ఖాన్ గురించి ఒక్క చిన్న పుస్తకమైనా ఎందుకు వేయలేదో జవాబివ్వాలి? మఖ్దూమ్ కవిత్వం అంతా ఎందుకు ఒక దగ్గరికి రాలేదో చెప్పాలి.
గజ్జెల మల్లారెడ్డి తర్జుమా చేసిన మఖ్దూమ్ కవితను కోట్ చేసిన ఎస్వీ ఎన్నడైనా నిజాంని పొగుడుతూ ప్రతియేటా పండితులు తెలుగులో పద్యాలు రాసేవారంటే నమ్ముతా రా?అలాంటి పద్యాలే నిజాం 49వ జన్మదినం సందర్భంగా గోల కొండ పత్రికలో అచ్చయ్యాయి. ఆ పద్యాలను చూసినట్లయితే ఆనాటి పండితులు నిజాంని చూసినతీరుని అర్థం చేసుకోవచ్చు.
'నైజాము సర్కరోడా-నాజీల మించినోడా' అనే పాటను రాసిన యాదగిరిని హతమార్చిన నైజాం పోలీసులను, ప్రభుత్వాన్ని, దానికి రాజైన నిజాంని నిందించాల్సిందే. యాదగిరితో పాటు మరో మూడువందల మందిని 1944-48 మధ్యలో చం పించినందుకు నిజాం ప్రభుత్వాన్ని నిలదీయాల్సిందే. ఇదే సమయంలో 1948-1951 మధ్యన అప్పటి భారత హోం మంత్రి వల్లభ్ బాయి పటేల్ సైన్యం, దానికి నేతృత్వం వహించిన నెహ్రూలు, నాలుగు వేల మంది తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని పొట్టన బెట్టుకోవడాన్ని ఎందుకు నిలదీయ కూడ దు? ఈ పని మీరెందుకు చేయరు? నిజాంని ఎత్తిచూపించి నెహ్రూని మరవడంలో మర్మమేంది?
యాదగిరి మృతికి అభ్యుదయ రచయితల సంఘం ఆనాటి నుంచీ సంతాపం ప్రకటిస్తుంది. అయితే యాదగిరి మృతిని శ్రీశ్రీ ఎదురుకాల్పుల సంఘటనగా రాశాడంటే నమ్మే గుండె ధైర్యం అరసంకు ఉందా? అవును శ్రీశ్రీ నిజాం ప్రభుత్వ సమాచార శాఖ లో ఉద్యోగిగా ఉంటూ ఇంగ్లీషు వార్తలను తెలుగులోకి తర్జుమా చేశాడు. ఈ విషయాన్ని ఎక్కడా ఎందుకు ప్రస్తావించరు?
ఒక వైపు తెలంగాణ ప్రజలు సాయుధ పోరాటం చేస్తూంటే మరో వైపు శ్రీశ్రీతో పాటుగా రాయప్రోలు, కురుగంటి సీతారామయ్య, కాసింఖాన్ ఇంకా అనేక మంది సాహితీవేత్తలు నిజాం ప్రభుత్వం లో కొలువులు చేశారు. అడివి బాపిరాజు, రాంభట్ల, తిరుమల రామచంద్ర లాంటివారు 'మీజాన్' పత్రిక ద్వారా పరోక్షంగా నిజాం ప్రభుత్వానికి అండగా నిలిచారు. ఈ విషయాలను ఇప్పుడైనా చర్చించాల్సిన అవసరం లేదా?
గాంధీ విషయంలో కూడా అర్ధసత్యాలనే ఎస్వీ ప్రచారంలో పెట్టారు. 1938లో స్టేట్ కాంగ్రెస్ ప్రారంభమైన వెంటనే నిషేధానికి గురయ్యింది. ఈ స్టేట్ కాంగ్రెస్ తరఫున నాయకులు సత్యాగ్రహాన్ని, శాసనోల్లంఘనను చేపడితే గాంధీ వారిమీద వత్తిడి తీసుకొచ్చి వాటిని వెంటనే విరమింపజేసుకునేలా చేశాడు. చేస్తున్న ఉద్యమాన్ని ఆపు చేయించడమంటే 'ఉద్యమం చేయవలసిన అవసరం లేదు'గా రఫత్, కనీజ్లు భావిస్తే తప్పేంటి? ఇక్కడి పాలనపై సానుకూలతను గాంధీ-అక్బర్ హైదరీ లేఖల్లో ఉల్లేఖితమైన విషయం పరిగణనలోకి తీసుకోవాలి.
చరిత్రకారులు నెగటివ్ దృక్పథంతో చరిత్రను రికార్డ్ చెయ్యడంలో జరుగుతున్న ద్రోహాలలో ఒకటి నిజాం నిరంకుశ పాలన వర్ణనలు. 1724 నుంచి 1948 వరకు హైదరాబాద్ రాజ్యాన్నిపాలించిన ఏడుగురు ప్రభువుల్లో చివరి నిజామ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ కేవలం పది సంవత్సరాల (1938 సత్యాగ్రహ ఉద్యమం నుంచి 1948 రజాకార్ ఉద్యమం వరకు) దుర్మార్గ పాలనను మొత్తం అతడి పరిపాలనకు, అంతకంటే అన్యాయంగా మొత్తంగా నిజాముల పాలనకు అంటగట్టడం ఏ విధంగా చూసినా ఘోరమే.
పోలిస్ యాక్షన్ రోజునే నిజాం పాలన అంతమైందని అంతా భావిస్తాం. ఆరెస్సెస్ విషప్రచారానికి బలైన మన మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా 1948 సెప్టెంబర్ 17న సర్దార్ వల్లబ్ భాయి పటేల్ కు నిజాం నవాబు వంగి దండం పెట్టే ఫోటోనే ప్రచురిస్తుంది. కానీ ఆ తర్వాత కూడా రాష్ట్ర అవతరణ వరకూ హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్గా పాలించింది నిజాం మీర్ ఉస్మాన్ అలీఖానేనని ఎందరికి తెలుసు? 1952 మార్చి 23న హైదరాబాద్ శాసనసభను ప్రారంభించింది ఈ ఏడో నిజామే. అదే నిరంకుశ(!) ఏడో నిజాం 1967లో మరణించినప్పుడు శవయాత్రలో లక్షలాది జనం పాల్గొనడం మరో విశేషం. అంతకంటే వింత ఏమిటంటే శాసనసభలో నిజాంకు సంతాపం వ్యక్తపరుస్తూ కాంగ్రెస్, రిపబ్లిక్, కమ్యూనిస్ట్, జనసంఘ్ (అప్పటి బిజెపి) నాయకులు ఆయన సేవలను కొనియాడడం.
17 సెప్టెంబర్ కు చరిత్రలో ఏమైనా ప్రాధాన్యత ఉందా? ఉంటే దాని విశిష్టత ఏంటి? అది విమోచనమా? విలీనమా? విద్రోహమా? లేదా వీటన్నింటి కలయికనా? దీంట్లో ఏవరి పాత్ర ఏంటి? కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ఆర్యసమాజ్, కాంగ్రెస్, రజాకార్లు, నెహ్రూ, పటేల్, నిజాం, మౌంట్బాటన్, వాల్టర్ మాంక్టన్,ఎల్ ఎద్రూస్, దుర్రెషెవార్, చర్చిల్, రామానంద తీర్థ, బూర్గుల రామకృష్ణారావు ఎవరు ఏం మాట్లాడారు? 1948లో ఏమన్నారు? ఆ తర్వాత ఏమన్నారు? ఇప్పుడు ఎవరు ఏమంటున్నారు? ఎందుకంటున్నారు? అనే విషయాల్ని వివరంగా తెలుసుకుంటే గానీ 17 సెప్టెంబర్ను ప్రజలు ముఖ్యంగా తెలంగాణ వాసులు ఎలా చూడాలో తేలుతుంది. ప్రజల జ్ఞాపకశక్తి చాలా తక్కువ అని అంచనా వేసే రాజకీయ నాయకులు తమ స్వలాభం కోసం చరిత్రను వక్రీకరించి అర్ధసత్యాలను, అసత్యాలను ప్రచారంలో పెట్టి నాణానికి ఒకవైపు మాత్రమే చూపించి అదే సర్వస్వం అని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రోజులూ జరిగింది అదే!
బ్రిటీష్ ప్రభుత్వం అక్కడి పార్లమెంటులో జూన్ 3, 1947నాడు ఇండియన్ ఇండిపెండెన్స్ చట్టాన్ని ఆమోదిస్తూ అక్కడి సంస్థానాలు భారత్లో గానీ, పాకిస్తాన్లోగానీ లేదా స్వతంత్రంగా గానీ ఉండవచ్చని తీర్మానం చేసింది. ఈ మేరకు నిజాం హైదరాబాద్ రాజ్యాన్ని స్వతంత్ర దేశంగా 27 ఆగస్టు 1947నాడు ప్రకటించాడు. హైదరాబాద్ స్వతంత్ర దేశం కాబట్టే భారత ప్రభుత్వం యథాతథ ఒడంబడిక చేసుకుంది. నవంబర్ 29, 1947 నాడు కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం విదేశీ సంబంధాలు, రక్షణ, కమ్యూనికేషన్ రంగాలు భారత ప్రభుత్వ అజమాయిషీలో ఉంటాయి. మిగతా వ్యవహారాలు నిజాం ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. ఈ ఒప్పందాన్ని కచ్చితంగా అమలు పరుస్తాం అనే నమ్మకాన్ని కలిగించేందుకు నిజాం ప్రభుత్వం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో నవంబర్ 30, 1947 నాడు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడు రామనందతీర్థ జైలు నుంచి విడుదలయ్యాడు.
భారత ప్రభుత్వం హైదరాబాద్పై దాడికి ప్రధాన కారణం శాంతిభద్రతల క్షీణత అని ప్రకటించింది. పేరు రజాకార్లు సృష్టిస్తున్న మారణహోమం అని బయటికి చెప్పినప్పటికీ రహస్య ఎజెండా మాత్రం సాయుధ రైతాంగ పోరాటం చేస్తున్న కమ్యూనిస్టుల నిర్మూలన. ఈ రెండిరటిని పకడ్బందీగా అమలుపరిచింది ఇండియన్ ప్రభుత్వం.
హైదరాబాద్ రాజ్యంలో పెట్రేగిపోతున్న రజాకార్లను అణచివేసేందుకు పోలీసు చర్య పేరిట భారత సైన్యాల దాడి జరిగింది. ఇది అధికారిక వాదన. అయితే ఈ పోలీసు చర్యకు కారకుడైన భారత ఉపప్రధాని సర్దార్ వల్లభబాయి పటేల్ ఫిబ్రవరి 27, 1949నాడు హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కమ్యూనిస్టుల మూలంగా చైనా, బర్మా తగలబడుతున్నాయి. ఇక్కడ కూడా అదే పరిస్థితి దాపురించే అవకాశముంది. కమ్యూనిస్టులంతా ప్రాంతేతరులే (హైదరాబాద్ రాజ్యానికి) వారు సమస్యను ఇంకా జఠిలం చేయాలని జూస్తున్నారు. పట్టుబడ్డ కమ్యూనిస్టుల్లో చాలామంది బయటి వారే. నేనొక్కటి చెప్పదలుచుకున్నాను. వారు ఎక్కడికైనా వెళ్లవచ్చు. అలా కాకుండా ఇక్కడే ఉండదలుచుకుంటే ఒక్కణ్ణి కూడా ప్రాణాలతో వదిలేది లేదు. ఎందుకంటే అది ఒక్క హైదరాబాద్ రాష్ట్రాన్నే కాదు మొత్తం దేశాన్నే విష పూరితం చేస్తుంది. (సెడ్ ద సర్దార్, హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రచురణ, 1950) దీన్ని బట్టి భారత సేనలు హైదరాబాద్ రాజ్యంపై ఏ లక్ష్యంతో దండయాత్రకు దిగాయో చూచాయగా అర్థమవుతుంది. మరోవైపు నిజాంకు తాబేదార్లుగా ఉండి, ఊర్లల్లో ప్రజల్ని పీడిస్తున్న దొరలు, దేశ్ముఖ్లు, దేశ్పాండ్యాలు, జమిందార్లు, జాగీర్దార్లు, నగరంలోని నవాబులు, పాయెగాలు, సంస్థానాధీశులు ప్రభుత్వానికి అండగా ఉన్నారు. ధనవంతులైన పారిశ్రామిక వేత్తలు కూడా నిజాంవైపే ఉన్నారు. చదువుకున్న మధ్యతరగతి కూడా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పోలీసు చర్యకు పెద్దగా స్పందించలేదు. చిన్న గ్రూపుగా ఉన్న సోషలిస్టులు అరుణా అసఫలీ, జయప్రకాశ్ నారాయణలను హైదరాబాద్కు పిలిపించి మహదేవ్ సింగ్ నేతృత్వాన బాధ్యతాయుత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేసిండ్రు. ఇదే విషయాన్ని 1948 సెప్టెంబర్ 11న ‘హైదరాబాద్ భావి కర్తవ్యం’ అనే పుస్తకానికి రాసిన ముందుమాటలో జయప్రకాశ్ నారాయణ వెల్లడిరచారు. అలాగే మాల మాదిగలు తదితర నిమ్న కులాల వాళ్లు పోలీస్ యాక్షన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి వరకు తాము ప్రభుత్వంలో భాగస్వాములుగా, మంత్రులుగా ఉండి తమ వర్గం వారికోసం సాధించిన ప్రయోజనాలు చిన్నవే అయినప్పటికీ అవి కూడా అందకుండా పోతాయని మిలిటరీని వ్యతిరేకించారు. అయితే మజ్లిస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బహద్దుర్యార్జంగ్(1905`1944) అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన అనంతరం పరిస్థితుల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. రజాకార్లు రెచ్చిపోయారు. ఆర్యసమాజ్ ప్రతి దాడులకు దిగింది. తబ్లీగ్ పేరిట మత మార్పిడులు ఊపందుకున్నాయి. బహద్దూర్ యార్జంగ్ ప్రచారంలో పెట్టిన ‘అనల్ మాలిక్’ (ముస్లింలందరూ రాజులే) అనే నినాదానికి మరింత పదును పెట్టారు. హైదరాబాద్ ఆర్మీ చీఫ్గా ఉన్న ఎల్ ఎద్రూస్ హైదరాబాద్ ప్రధాని లాయక్ అలీ, ఉస్మానలీఖాన్ ఇద్దరికీ యుద్ధం మంచిది కాదు. యుద్ధం వస్తే నాలుగు రోజులకన్నా ఎక్కువగా ఫైట్ చేయలేమని కూడా చెప్పాడు. యుద్ధానికి సరిపడే ఆయుధాలు కొనుగోలు చేయడానికి ఎద్రూస్ లండన్ కూడా వెళ్లాడు. అయితే ఆ ఆయుధాల్ని భారత భూభాగం గుండా భారత్ కళ్లుగప్పి తీసుకెళ్లడం అంత సులభమైన పని కాదని, అలాగే అంతర్జాతీయ స్థాయిలో దేశస్థాయి దక్కని దేశానికి ఆయుధాలు బహిరంగంగా అమ్మడానికి సుముఖత లేకపోవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే ఈ ఆయుధాలను హైదరాబాద్ ప్రభుత్వం సిడ్నీకాటన్ (1894`1969) ద్వారా దొంగచాటుగా దిగుమతి చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన కాటన్ ఉస్మాన్ అలీఖాన్కు నమ్మిన బంటుగా ఉంటూ పాకిస్తాన్ మందుల్ని (మెడిసిన్స్ని), మందుగుండు సామాగ్రిని హైదరాబాద్కు తరలించాడు. గూఢచర్యంలో అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన వ్యక్తి. ఈయన జెకోస్లావేకియా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలను హైదరాబాద్కు తరలించాడు.
ఇక కమ్యూనిస్టుల విషయానికి వస్తే తాము ఎవరినైతే ప్రస్తుతం నాజీ, నియంత, నిరంకుశుడు, రాక్షసుడు అని నిందిస్తున్నారో ఆ ఏడో నిజాం మీర్ ఉస్మానలీఖాన్తో కమ్యూనిస్టులు మిలాఖత్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢల్లీిలో ఏర్పడ్డ కేంద్ర (నెహ్రూ) ప్రభుత్వం బూర్జువా, పెట్టుబడిదారి వర్గాల కొమ్ము కాస్తుందని దాన్ని కూలయదోయాలని కమ్యూనిస్టు పార్టీ పిలుపునిచ్చింది. మఖ్దూమ్ మొహియుద్దీన్, రావి నారాయణరెడ్డిలు మే నాలుగు, 1948 నాడు నిజాం ప్రధాని లాయక్ అలీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కమ్యూనిస్టు పార్టీ మీద ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడమే గాకుండా మఖ్దూమ్ మరో ఐదుగురు కమ్యూనిస్టు నాయకులపై ఉన్న వారంట్లను నిజాం ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పటి వరకు శత్రువులుగా ఉన్న వారు మిత్రులయ్యారు. దీంతో కమ్యూనిస్టులు రజాకార్లను ప్రజాసైన్యంగా వర్ణించారు. కమ్యూనిస్టు పార్టీ హైదరాబాద్ శాఖ ఈ సమయంలో ఒక తీర్మానం చేసి ఎనిమిది పేజీల కరపత్రాన్ని ప్రచురించింది. దీంట్లో కాంగ్రెస్పై దాడి చేసింది. అలాగే నిజాం రాజ్యం భారత యూనియన్లో చేరకూడదు. నెహ్రూ ప్రభుత్వం ధనిక వర్గ ప్రభుత్వం. పెట్టుబడిదారీ దోపిడిని బలవంతంగా కొనసాగించాలనే ఉద్దేశంతో సంస్థానాలను బలవంతంగా విలీనం చేసుకుంటున్నారు. హైదరాబాద్ రాష్ట్రం స్వతంత్రంగా ఉండాలి అని పేర్కొంది. అంత వరకు అజ్ఞాతంలో ఉన్న రాజ్బహదూర్ గౌర్ హష్మత్ గంజ్లో జరిగిన బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్ రాష్ట్రం (రాజ్యం) స్వతంత్రంగా ఉండాలి. అది కమ్యూనిస్టు పార్టీ విధానమని ప్రకటించాడు.
మరోవైపు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ మహ్మద్ అలీ జిన్నా సెప్టెంబర్ 11న చనిపోవడంతో అదే రోజు హైదరబాద్ను స్వాధీనం చేసుకునేందుకు భారత ప్రభుత్వం యత్నాలు ప్రారంభించింది. సెప్టెంబర్ 12న జరిగిన క్యాబినెట్ సమావేశంలో పటేల్కు మద్ధతుగా అప్పటి ఆయన క్యాబినెట్ సహచరుడు, ఆ తర్వాత జనసంఫ్ుని స్థాపించిన శ్యామాప్రసాద్ ముఖర్జీ నిలిచాడు. హైదరాబాద్పై దాడికి ప్రయత్నాలు జరుగుతున్నాయని పసిగట్టిన నిజాం అప్పటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారితో సంప్రదించి దాడిని ఆపవలసిందిగా కోరాడు. ఇదే విషయాన్ని ఆయన నెహ్రుతో ప్రస్తావించి సంయమనం పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేశాడు. అయితే గతంలో రెండు సార్లు హైదరాబాద్పై దాడికి సమాయత్తమై నెహ్రూ సూచన మేరకు వెనక్కి తగ్గిన పటేల్ ఈ సారి మాత్రం ఎవ్వరి మాటా వినకుండా సైన్యాలు బయలుదేరినాయని సమాధానమిచ్చాడు. అంతకు ముందు జరిగిన అంతర్గత సమావేశంలో హైదరాబాద్పై దాడికి దిగినట్లయితే ఇటు అరబ్ నుంచి విమానాలు బొంబాయిపై అటు కలకత్తాపై ఈస్ట్ పాకిస్తాన్ నుంచి సైన్యాలు బాంబుల దాడులు జరిపే అవకాశముందనే భయాన్ని మంత్రివర్గ సహచరులు వ్యక్తం చేయగా శ్యామప్రసాద్ ముఖర్జీ జవాబిస్తూ భారత దేశాన్ని క్యాన్సర్లా పీడిస్తున్న హైదరాబాద్ని దారికి తెచ్చుకోవాల్సిందే! కలకత్తా మీద దాడి జరిగితే బెంగాల్ ప్రజలు త్యాగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక బెంగాళీ నేతృత్వంలో (జయంత్ నాథ్ చౌదరి` హైదరాబాద్పై దాడికి దిగిన భారత సైనికాధికారి) విజయం సాధించామనే తృప్తి మిగులుతుందని చెప్పాడు. దీనికి తోడు హైదరాబాద్లో పటేల్ నియమించిన భారత గవర్నర్ జనరల్ కె.ఎం.మున్షీ హిందూభావజాలం ఉన్నవాడు, హైదరాబాద్ లొంగి పోవడంలో కీలక పాత్ర పోషించాడు కాబట్టి బిజెపి వాళ్లు హైదరాబాద్ని ముస్లిం పాలకుల నుంచి హిందువులకు విముక్తిగా ప్రచారం చేస్తూ 17 సెప్టెంబర్ని పండుగలాగా చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
1998లో బిజెపి తాము కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు విమోచన అనే పదం మొదటి సారిగా తెరమీదికి తెచ్చింది. ఈ విమోచన ఉత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలనే డిమాండ్ ముందుకు తీసుకు వచ్చారు. నిజానికి 17 సెప్టెంబర్, 1948 నాడు ముస్లిం పాలకుని నుంచి విముక్తి దొరికితే ఆ తర్వాత కూడా సర్వాధికారిగా నిజాం ఎలా కొనసాగాడు. దేశ విభజన సమయంలో మతకలహాలు జరిగి వేలాది మంది మృత్యువాత పడితే ఆశ్చర్యకరంగా హైదరాబాద్పై పోలీసు చర్య సందర్భంగా హైదరాబాద్ రాజ్యంలో ఒక్క మతకలహాల సంఘటన జరగలేదనే అంశానికి ఎందుకు ప్రాధాన్యత నివ్వరు. ఏప్రిల్ 1, 1950నాడు నిజాంకు, భారత ప్రభుత్వానికి కుదిరిన ఒప్పందం మేరకు ప్రైవీ పర్స్ కింద ఏడాదికి ఎలాంటి పన్ను లేకుండా 50 లక్షల రూపాయల భరణం (నిజాంకు) చెల్లించడానికి, దేశంలో, విదేశాల్లో నిజాం ఎక్కడ పర్యటించినా ఆయనకు హైదరాబాద్ రాజుగా హెచ్ ఇ హెచ్(హిజ్ ఎగ్జాల్టెడ్ హైనెస్) గానే, అన్ని బిరుదులు యథాతథంగా కొనసాగించేందుకు నిర్ణయం జరిగింది. అన్నీ యథావిధిగా కొనసాగి, 1950 జనవరి 25 వరకు ప్రభుత్వాధినేతగా, 26 జనవరి 1950 నుంచి అక్టోబరు 31, 1956 వరకు రాజ్ ప్రముఖ్గా కొనసాగాడు. ఈ గౌరవం కాశ్మీర్ని ఇండియన్ యూనియన్లో కలిపిన హరిసింగ్కు దక్కలేదనే విషయాన్ని కూడా ఇక్కడ గుర్తుంచుకోవాలి.
విమోచన అంటే స్వేచ్ఛ లభించడం. కాని హైదరాబాద్ రాజ్య ప్రజలకు విమోచన ద్వారా స్వేచ్ఛ లభించక పోగా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. గొర్రెలు తినేవాడు పోయి మిలిట్రీ రూపంలో బర్రెలు తినేవాడు వచ్చినట్టయ్యింది. మరఠ్వాడా, కర్నాటక ప్రాంతాల్లో భారత సైన్యం వేలాది మంది నిరాయుధులైన ముస్లింలను ఊచకోత కోసింది. ఈ విషయాన్ని నెహ్రూ నియమించిన సుందర్లాల్ కమిటీ తేల్చి చెప్పింది. కమిటీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ వాది అనే విషయాన్ని గ్రహించాలి. కొంతమంది మేధావులు యుద్ధం జరిగితే మరి ప్రాణనష్టం ఉండదా? అని ప్రశ్నిస్తున్నారు. యుద్ధంలో మరణాలు ఏకపక్షంగా ఉండవనేది తెలిసిందే. ఈ యుద్ధానికి భారత ప్రభుత్వం సైనిక పరంగా ఎన్నో రహస్య పేర్లు (ఆపరేషన్ కాటర్పిల్లర్ అందులో ఒకటి) పెట్టినప్పటికీ బహిరంగంగా సైనిక పరిభాషలో ఆపరేషన్ పోలో, సామాన్య జనం భాషలో పోలీస్ యాక్షన్ అని ప్రచారంలో ఉండిరది. భారత ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని ఆమోదించింది.
అంతర్జాతీయ సమాజం నుంచి జరిగే దాడిని తప్పించుకునేందుకే హైదరాబాద్పై మిలిటరీ ద్వారా దాడి చేసినప్పటికీ దాన్ని పోలీస్ యాక్షన్గా పిలిచారు. భారత ప్రభుత్వ దాడిని ఖండిస్తూ నిజాం ప్రభుత్వం భద్రతా సమితికి ఫిర్యాదు చేసింది. భద్రతా సమితిలో కేసు విచారణకు వచ్చి భారత్పై చర్య తీసుకోవడం ఖాయం అనిపిస్తున్న దశలో నిజాంని ఒప్పించి కేసు ఉపసంహరించుకునేలా చేశారు. మహారాష్ట్ర, కర్నాటకల్లో విమోచన జరుపుతున్నారు కాబట్టి తెలంగాణలో కూడా విమోచన పండుగ జరిపి తీరాలని బిజెపి డిమాండ్ చేస్తుంది. నిజానికి బిజెపి భాగస్వామ్య ప్రభుత్వాలున్న కాలంలోనే ఆ రాష్ట్రాల్లో విమోచన పండుగ జరపడం ఆరంభమయింది. అంతేగాకుండా మరఠ్వాడా, కర్నాటక ప్రాంతాలు భాషా పరంగా ఆయా రాష్ట్రాలతో మమేకమయ్యారు. నిజంగానే నిజాం పాలన నుంచి విముక్తి లభించిందని భావించారు. తెలంగాణలో పరిస్థితి అలా లేదు. ఇక్కడి ఆంధ్రప్రాంతం వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏనాడు మమేకం కాలేక పోయారు. అందుకే ఇక్కడ విమోచనకు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.
పోలిస్ చర్యను విలీనం అనడానికి కూడా వీల్లేదు. ఇరు వర్గాల సమ్మతి మేరకు కలిసి పోతే విలీనం జరిగినట్టు లెక్క. అలా కాకుండా భారత సైన్యం చర్యను ఆనాటి అంతర్జాతీయ పత్రికలన్నీ దురాక్రమణగా, దాడిగా, దండయాత్రగా, యుద్ధం, అణచివేతగానే రిపోర్ట్ చేశాయి. 17 సెప్టెంబర్ తర్వాత కూడా నిజాం పేరిటనే ఫర్మానాలు విడుదలయ్యాయి. కరెన్సీ కూడా నిజాం ప్రభుత్వమే 1953 వరకు ముద్రించింది. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తీర్పునిస్తూ హైదరబాద్ స్వతంత్ర దేశం దానికి సంబంధించిన విషయాలు తమ పరిధిలోకి రావని స్పష్టంగా తీర్పునిచ్చింది. నిజానికి విలీనమంటే దాని వల్ల ఇక్కడి ప్రజలకు ఎంతో కొంత మేలు జరగాలి. కాని దురదృష్టవశాత్తు విలీనం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది. ఇక్కడి ఉద్యోగాలు పోయాయి. పరాయి పాలనకు తెర లేచింది. ప్రజలు పోరాడి సాధించుకున్న భూమి భూస్వాముల పాలయింది. అన్ని అనర్థాలకు మూల కారణమైన విలీనాన్ని పండుగలాగా ఎలా చేసుకోగలం?
1948 పోలీస్ యాక్షన్ తర్వాత పాలనలో తమదైన ముద్రను వేసేందుకు భారత ప్రభుత్వం మద్రాసు రాష్ట్రం నుంచి హైదరాబాద్ రాజ్యానికి ఇబ్బడి ముబ్బడిగా ఉద్యోగులను దిగుమతి చేసుకుంది. వీరందరూ అప్పటి వరకు హైదరాబాద్ రాజ్యంలో ఉన్నతోదోగ్యాల్లో ఉన్న ముస్లింలు ఇంగ్లాండ్, అమెరికా, పాకిస్తాన్ లాంటి దేశాలకు వలసపోగా వారి స్థానాల్లో వచ్చినవారే! ఇలా వచ్చిన వారు హైదరాబాద్ రాజ్య (రాష్ట్ర) ప్రజలకు భాష రాదు, తెలివిలేదు. తాము అవి నేర్పడానికి వచ్చిన వారిగా భావించి తమ అహంభావాన్ని ప్రదర్శించారు. 60 ఏండ్ల నుంచి ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. మద్రాసు ప్రావిన్స్ నుంచి వచ్చిన ఉద్యోగులు ఉన్నత స్థాయిల్లో ఉద్యోగాలు సంపాదించారు. దాంతో కింది స్థాయి ఉద్యోగాలు కూడా తమ ప్రాంతం వారికే కట్టబెట్టేవారు. దీనికి నిరసనగానే 1952 సెప్టెంబర్లో ముల్కీ ఉద్యమం ఉధృతంగా ముందుకు వచ్చింది. డజన్కు పైగా విద్యార్థులు పోలీసు కాల్పుల్లో చనిపోయారు. ఇందుకు కారణమైన సెప్టెంబర్ 17ని పండుగలాగా చేసుకుందామా?
ఒకవైపు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకులు రామానంద తీర్థ, దిగంబరరావు బిందు, బూర్గుల రామకృష్ణారావు, మాడపాటి రామచంద్రరావుల నాయకత్వంలో నిజాం బాధ్యతాయుత ప్రభుత్వంని ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేశారు. నిజాం నేతృత్వంలోనే ప్రజలకు తగిన ప్రాతినిధ్యం కలిగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కమ్యూనిస్టులు సాయుధ పోరాటం ద్వారానే ప్రజలకు విముక్తి దొరుకుతుందని పోరాటాలు చేశారు. దొడ్డి కొమురయ్య మరణం నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగిన తొలి దశ పోరాటంలో ఒకవైపు నిజాం సైన్యాన్ని మరోవైపు కిరాయి మూక రజాకార్లను సాయుధంగా, సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. ఈ కాలంలోనే నైజాం సర్కరోడా నాజిల మించినవురో! అనే పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే 1948 లో కలకత్తాలో జరిగిన ప్లీనరీలో కమ్యూనిస్టుల స్వరం మారింది. నెహ్రూ ప్రభుత్వం బూర్జువా ప్రభుత్వం విస్తరణ కాంక్షతో ఉంది. అందుకు నెహ్రూ సైన్యాన్ని ఎదుర్కోవాలని తీర్మానించి 1951 అక్టోబరు వరకు సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా రంగు రంగుల మారి నెహ్రయ్య నీ రంగు బహిరంగమాయె లాంటి పాటలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే సాయుధ పోరాటం ద్వారా ప్రజలు సాధించుకున్న నాలుగువేలకు పైగా గ్రామాల విముక్తి, పేద రైతులు కబ్జాలోకి తెచ్చుకున్న పది లక్షల ఎకరాలు ఈ విలీనం కారణంగానే మళ్లీ భూస్వాములు కాంగ్రెస్ నాయకుల అవతారమెత్తి గుంజుకోవడం సాధ్యమయింది. కమ్యూనిస్టులు ఆజాద్ హైదరాబాద్ అనే నినాదమిచ్చారు. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు కూడా 17ని పండుగలాగా చేసుకోవాలంటే ఆశ్చర్యంగా ఉంది. భారత సైన్యం హైదరాబాద్ రావడానికి ప్రధాన కారణం కమ్యూనిస్టులను అణచివేయడమే. తమని అంతమొందించడానికి పునాది పడ్డ ఆ రోజుని పండుగ ఎలా చేసుకుంటారో అర్థం కావడం లేదు.
ఏకు మేకై తన మాటని కూడా ఖాతరు చేయని కాసిం రజ్వీ నాయకత్వంలోని రజాకార్లను అణచివేయడానికి తప్పనిసరి పరిస్థితుల్లో నిజాం కూడా సహకరించాడు. రజాకార్లు తీవ్రంగా వ్యతిరేకించినా హైదరాబాద్ రాజ్య న్యాయ సలహాదారుగా సర్ వాల్టర్ మాంక్టన్ని కొనసాగించడం ఇందుకు నిదర్శనం. రజాకార్లంటే కేవలం ముస్లింలనే భావన ఉంది. ముస్లింలతో బాటుగా శ్యామ్ సుందర్, బి.ఎస్.వెంకటరావు, పీసరి వీరన్న లాంటి దళిత నాయకుల ప్రభావంతో మతం మార్చుకున్న దళితులు, దొరలు, భూస్వాములతో పాటుగా వారి అనుచరగణం కూడా రజాకార్లలో ఉన్నారు. భైరాన్పల్లి మొదలు అప్పంపల్లి వరకు రజాకార్లు చేసిన అకృత్యాలను ఎండగట్టాల్సిందే. అందుకు తగ్గట్టుగానే కాసిం రజ్వీకి కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాతనే రజ్వీ తన నేతృత్వంలోని ఎంఐఎం పార్టీని ఇప్పటి హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ తాత వాహిదుద్దీన్కు అప్పజెప్పిండు. రజ్వీకి ఉరిశిక్ష వెయ్యాల్సుండే అనే వారు ఆనాడు హైదరాబాద్ రాజ్యంలో ఉరిశిక్ష అమలులో లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఉరిశిక్ష నిజంగానే అమలులో ఉండి ఉంటే నిజాంపై బాంబుదాడి చేసిన నారాయణ పవార్, గండయ్య, కొండాలక్ష్మణ్ బాపూజీలు బతికుండేవారు కాదు. హిందూ భావజాలం ఉన్నవాళ్ళకు 17 సెప్టెంబర్ విమోచనగా కన్పించవచ్చు. భారత, ఆంధ్ర పెట్టుబడిదార్లకు విలీనంగా కన్పిస్తూ ఉండవచ్చు. కానీ ‘పోలిస్ చర్య’ అనంతర పరిణామాల దృష్ట్యా తెలంగాణ ప్రజలవైపు నుంచి చూస్తే అది సర్వ అనర్థాలకు నాంది.
