జ్యోతీ మల్హోత్రా కన్నా ముందు మాధురీ గుప్తా!!

- పాక్ ఐఎస్ ఐ వలలో పడిన మాథురీ గుప్తా
- ఇస్లామాబాద్ లో ఇండియన్ హైకమిషన్లో ఉన్న గుప్తా
- ఆమెపై హానీ ట్రాప్ వేసి ముగ్గులోకి దించిన పాక్ ఐఎస్ఐ
- ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారుల వివరాలు ఇచ్చిన గుప్తా
- పాకిస్థాన్ ఐఎస్ఐ వాడిని ప్రేమించిన మాథురి
- ఆమె నివాసం నుంచే కీలక సమాచారం లీక్
- జమ్మూకశ్మీర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డీటైల్స్ కూడా
- మాథురిని అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు
- 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
- తిరిగి అప్పీల్ చేసుకున్న మాథురి
- విచారణ పెండింగ్ లో ఉండగానే మరణం
పాకిస్థాన్ స్పైగా పనిచేస్తోందన్నఆరోపణలపై అరెస్టయిన యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా కన్నా ముందు పాకిస్థాన్ ఇలాంటి హానీ ట్రాప్ తరహా మరో మోసానికి చాలా కాలంక్రితమే పాల్పడింది.2010లో ముంబైదాడుల తర్వాత అంటే 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే తరహాలో భారత దౌత్యవేత్త గూఢ చర్యం చేస్తూ పట్టుబడింది.ప్రమాదకరమైన ఐఎస్ ఐ చేతిలో పావులా మరింది.అప్పట్లోనే దాయాది దేశం మనపై కుట్రలకు పాల్పడుతున్నా మనం ఆ సంగతిని నేరుగా గ్రహించలేకపోయాం. ఇంటెలిజెన్స్ చీఫ్రాజీవ్ మాథుర్ ఈ విషయం గ్రహించే సరికే కొంత ఆలస్యమైంది.
మాధురీ గుప్తా.. బీ గ్రేడ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి.ఇస్లామాబాద్ లోని ఇండియన్ హైకమిషన్ లో రెండో ప్రెస్ సెక్రటరీగా కూడా ఆమె బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఉర్దూలో స్కాలర్ షిప్ చేసిన ఆమెకి, సూఫీజం మీద ప్రత్యేక ఆసక్తి. కవిత్వమన్నా ఆమెకు మక్కువ ఎక్కువ. రెండు పదవుల నిర్వహణకు ఆమె అర్హతలు ఏ మాత్రం సరిపోక పోయినా భారత మహిళ కాబట్టి సిన్సియర్ గా పనిచేస్తారనుకున్నారు. కానీ కొన్నాళ్లకి ఆమె అసలు నైజం బయటపడింది. గుప్తా గూఢచర్యానికి పాల్పడుతోందని ప్రాధమిక అంచనాలు రావడంతో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీవ్ మాథుర్ పై అధికారులకు నివేదించారు. మాథురీ గుప్తా అరెస్టు కోసం రంగం సిద్ధం చేసుకున్న అధికారులు ఆమెను సార్క్ సమావేశాలకు మీడియా హెడ్ గా స్పెషల్ డ్యూటీ పేరు మీద భారత్ రప్పించారు. అయితే తన చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలియని మాధురి 2010లో భారత్ వచ్చారు. వెస్ట్ ఢిల్లీలోని తననివాసంలో ఆ రాత్రికి బస చేసి మరుసటి రోజు విదేశాంగశాఖ కార్యాలయానికి వెళ్లారు. సౌత్ బ్లాక్ లోని స్పెషల్ సెల్ పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడకు వచ్చారు. క్షణాల్లో గుప్తాను కస్టడీలోకి తీసుకున్నారు. భారత రక్షణ దళాలకు సంబంధించిన కీలక, సున్నిత సమాచారంపాక్ ఐఎస్ ఐకి చేరవేసినందుకు ఆమెను అరెస్టు చేశారు.
రహస్యాలన్నీ బట్టబయలు..
అధికార రహస్యాల చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు. భారత ఇంటెలిజెన్స్ అధికారుల గుట్టు మట్లను ఆమె పాకిస్థాన్ కు చేరవేశారని అభియోగాలు నమోదయ్యాయి. ఇస్లామాబాద్ లో రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ కు చెందిన ఆర్.కె.శర్మ అండర్ కవర్ ఆపరేషన్స్ లో ఉన్న విషయాన్ని మాధురి పాక్ ఐఎస్ఐకి చేరవేశారు.ఇస్లామాబాద్ ఇండియన్ హై కమిషన్ లో కౌన్సిలర్ పేరుతో ఆర్.కె. శర్మ అక్కడ రా ఎజెన్సీ కోసం పనిచేస్తున్నారు.
పాకిస్థాన్ లో ఉన్నఇండియన్ ఇంటెలిజె్న్స్ అధికారుల పూర్తి సమాచారం, వారి బయోగ్రాఫికల్ వివరాలతో సహా అన్నీ మాధురి పాకిస్థాన్ ఐఎస్ ఐకి చేరవేసింది. అలాగే భారత్ కు వెళ్లేందుకు ఉన్న కొన్ని రహస్య మార్గాలు కూడా వారి చెవిన వేసింది.
అలా పాకిస్థాన్ లో భారత రిసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ ఆపరేషన్స్ అన్నీ బట్టబయలు చేసి అక్కడ మన కార్యకలాపాలేవీ సాగకుండా మాథురి దేశ ద్రోహానికి పాల్పడింది.
ఎందుకలా చేసింది?
మాధురిపై కూడా అక్కడి అధికారులు హానీట్రాప్ వేశారన్నది మన దర్యాప్తు అధికారులు చెబుతున్న మాట. ఆమెకన్నా వయసులో చిన్న వాడయిన జంషెడ్ అలియాస్ జిమ్ మాథురీపై వలపు వల విసిరాడు. ఆమెనుంచి చాలా తెలివిగా సమాచారం సేకరించాడు. ఈ పనులకు అప్పటి పాకిస్థాన్ హోం శాఖా మంత్రి రెహమాన్ మాలిక్ సహాధ్యాయి అయిన ముదాసర్ రాజా రాణా సహకరించాడు. ఒక మహిళా జర్నలిస్టు ద్వారా మాధురితో పరిచయం పెంచుకుని జేషే మహమ్మద్ ఉగ్ర సంస్థ అధిపతి మౌలానా మసూద్ అజార్ రాసిన అరుదైన పుస్తకం వెతకడంలో ఆమెకు సహకరించారు. ఇస్లామాబాద్ లోని తన నివాసంలో ఓక కంప్యూటర్, బ్లాక్ బెర్రీ ఫోన్ ఆమెకు ఏర్పాటు చేయడంతో ఆమె వారితో నిరంతర సంభాషణలు జరుపుతూ కీలక సమాచారం చేరవేసేది.
ప్రేమించిన మాథురీ
మాథురీ గుప్తా జంషెడ్ పై ప్రేమ పెంచుకుని తనను పెళ్లి చేసుకోమని, ఇస్తాంబుల్ వెళ్లిపోదామనీ కోరిందని తేలింది. అవసరమైతే ముస్లిం మతంలోకి మారేందుకు కూడా ఆమె రెడీ అయ్యింది. ఇస్లాం మతం, సూఫీ మతం, రూమీ, ఉర్దూ సాహిత్యం వంటి అంశాలపై చర్చలు జరపడం ద్వారా ఆమెను జంషేడ్ ముగ్గులోకి దింపాడు. ఈమొత్తం వ్యవహారంలో మధ్యవర్తి అయిన ముదస్సార్ రాజా రాణా సూచనలతోనే మాధురీ గుప్తా జమ్మూ కశ్మీర్ కు వెళ్లి అక్కడ ప్రతిపాదనలో ఉన్న 310 మెగావాట్ల హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్టు కు సంబంధించిన వివరాల వార్షిక నివేదికను సేకరించి పాక్ అధికారులకు అప్పగించింది. మాధురి మెయిల్ నుంచి ఇద్దరు వ్యక్తులకు తరచుగా ఈ కీలక సమాచారం వెళ్లిన విషయాన్ని దర్యాప్తు అధికారులు థృవీకరించారు.
2012లో మాథురీ గుప్తాపై అధికార రహస్యాల చట్టం 3,5 సెక్షన్ల ప్రకారం కేసులు నమోదయ్యాయి. ఆమెకు 14 ఏళ్ల జైలుశిక్ష పడింది. అయితే తీహార్ జైలులో 21 నెలలు శిక్ష అనుభవించాక ఆమెకు బెయిల్ దక్కింది.2018లో సిటీ కోర్టు ఆమెను పాకిస్థాన్ కు గూఢచర్యం చేసినందుకు నిందితురాలిగా పేర్కొంది.కేసు కోర్టులో విచారణ దశలో ఉండగానే 64 ఏళ్ల వయసులో మాధురి చనిపోయారు. తాను నిర్దోషినని ఆమె చేసుకున్న అపీల్ ఢిల్లీ హైకోర్టులో పెండింగ్ లో ఉండగానే ఆమె చనిపోయింది.
