ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల గడువు 10 రోజుల్లో ముగుస్తుంది. అయితే, రేషన్‌ కార్డులకు అప్లై చేసుకోవడానికి వివాహ రిజిస్ట్రేషన్‌ సమస్య వెంటాడుతోంది. కార్డుల్లో సభ్యులను చేర్చడం లేదా తొలగించడం, అలాగే మార్పులు, చేర్పులకు మ్యారేజ్‌ సర్టిఫికెట్‌ అప్‌లోడ్‌ చేయాల్సిందిగా ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ వస్తోంది. దీంతో, రేషన్‌ కార్డులకు దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.



ఏపీలో కొత్త రేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు.. అలాగే, ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు చేర్పులకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో, అర్హులైన వాళ్లంతా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం వస్తున్న దరఖాస్తులలో దాదాపు 80శాతం దాకా కార్డుల్లో పేర్ల తొలగింపులు లేదా చేర్పుల కోసమే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, ఈ తరహా దరఖాస్తులకు కొత్త చిక్కులు వస్తున్నాయి. సంబంధిత మంత్రి సహా ఉన్నతాధికారులు మ్యారేజ్‌ సర్టిఫికెట్లు అవసరం లేదని ప్రకటించారు. కానీ, దరఖాస్తులు చేసుకుంటున్న సమయంలో మాత్రం సిబ్బంది ఆ సర్టిఫికెట్‌ ఉంటేనే అప్లికేషన్‌ తీసుకుంటామని చెబుతున్నారు. మరణించిన వాళ్ల పేర్లు కాకుండా.. ఇతరుల పేర్లు రేషన్‌ కార్డుల నుంచి తొలగించేందుకు అవకాశం లేదని సిబ్బంది తెగేసి చెబుతున్నారు.



ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన రేషన్‌ కార్డుల దరఖాస్తు ప్రక్రియలలో ఇప్పటి వరకూ 3,48,399 దరఖాస్తులు అందాయని అధికారులు చెబుతున్నారు. వీటిలో దాదాపు 75 శాతం అప్లికేషన్లు కుటుంబ సభ్యులను కార్డుల్లో చేర్చుకునేందుకు చేసుకున్నవే. అయితే, ఈ తరహా దరఖాస్తులకు ఈకేవైసీ, సర్వర్ సమస్యలు వెంటాడుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ జనాలకు మ్యారేజ్‌ సర్టిఫికెట్లు ఉండవు. కానీ, కొత్తగా పెళ్లైన వారు రేషన్‌ కార్డుల్లో కుటుంబసభ్యుల పేరు చేర్చుకునేందుకు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. దీంతో, వీళ్లంతా ఇప్పుడు కొత్తగా పెళ్లికార్డులు ప్రింట్ చేయించుకుంటున్నారు. సాధారణంగా పెళ్లైన 60 రోజుల్లోగా గ్రామ, వార్డు సచివాలయంలో పెళ్లి సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ గడువు దాటిపోతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ తిరగాలి. ఇప్పుడు పెళ్లి సర్టిఫికేట్ లింక్ పెట్టడంతో.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు పరుగులు పెడుతున్నారు. సర్టిఫికేట్ వచ్చేలాగా దరఖాస్తు గడువు ముగుస్తుందనే ఆందోళన దరఖాస్తుదారుల్లో మొదలైంది.వివాహ ధ్రువపత్రాలు అవసరం లేదని, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ నంబరు, ఫొటో ఇస్తే దరఖాస్తు అప్‌లోడ్ అవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే మ్యారేజీ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తేనే ప్రాసెస్ ముందుకు వెళ్తుందని సచివాలయ సిబ్బంది అంటున్నారు. హౌజ్‌హోల్డ్ మ్యాపింగ్ చేయకపోవడంతో ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.హౌస్ హోల్డ్ డేటా ఎనేబుల్ చేయకపోవడంతో సమస్యలు వస్తు్న్నాయని సచివాలయ సిబ్బంది అంటున్నారు. ఒకే తెల్ల రేషన్ కార్డుపై...రెండు రైస్ కార్డులు ఉంటున్నాయి. కుటుంబ సభ్యులుంతా ఒకే మ్యాపింగ్ కింద ఉంటున్నారు. కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. హౌస్ హోల్డ్ డేటా విభజనకు కూడా ఎనేబుల్ చేయాలని కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో బియ్యం కార్డుల దరఖాస్తుదారులను సర్వర్ ముప్పుతిప్పలు పెడుతోంది. ఉదయం వచ్చిన వారిని సాయంత్రం వరకూ సచివాలయాల్లో కూర్చోబెడుతోంది. సర్వర్లు సరిగ్గా పనిచేయడంలేదని, పనిచేసిన కాసేపు ఏదో సమస్యలు వస్తున్నాయంటున్నారు.మొబైల్ ద్వారా ఈకేవైసీ చేయాలన్నా, సర్వర్ సమస్యలు వస్తున్నాయని అంటున్నారు. మరో 10 రోజుల్లో రేషన్ కార్డుల దరఖాస్తులు ముగుస్తాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.




Updated On 23 May 2025 1:46 PM IST
Politent News Web4

Politent News Web4

Next Story