వైసీపీ నేతలు తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు
మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం

కోవూరు ఎమ్మెల్యే, మహిళా శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని, ఆయన వెంటనే క్షమాపణలు చెప్పకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు.ప్రజలు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. మహిళా లోకాన్ని అగౌరవపరిచేలా చేసిన నల్లపురెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళలను అగౌరవపర్చడం సరికాదన్నారు. రాజకీయ విమర్శలు దాటి వ్యక్తిగత విమర్శలు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి కించపరిచేలా మాట్లాడటం హేయమైన చర్య అన్నారు. స్త్రీలను విమర్శించడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారిందన్నారు. వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత ధ్వేషమని నిలదీశారు.యావత్ మహిళా లోకాన్ని కించపరిచి సభ్య సమాజాన్ని ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మహిళలను కించపరుస్తుంటే వైసీపీ అధినాయకుడు జగన్ ఏం చేస్తున్నారు. ఆయన మౌనంగా ఉంటే సరిపోతుందా, ఖండించి చర్యలు తీసుకునే బాధ్యత లేదా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం మహిళా లోకానికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
