బాబుకు బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ ఇచ్చావు...ఎమ్మెల్సీ కవిత
KCR will not harm Telangana even in his dreams

కేసీఆర్ దమ్మేంటో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులను అడిగితే తెలుస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ పోరాడి తెలంగాణ సాధించారు కాబట్టే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ హామీ ఇచ్చిన మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వడంతో పాటు పింఛన్ల పెంపు హామీని నిలబెట్టుకోవాలని కోరుతూ బుధవారం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అబిడ్స్ జనరల్ పోస్ట్ ఆఫీస్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం సోనియాగాంధీకి పోస్ట్ కార్డులు పోస్ట్ చేశారు.
ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ, ఏపీ సీఎం చంద్రబాబును పిలిచి ప్రజాభవన్ లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లను గిఫ్ట్ గా ఇచ్చిందే రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కలలో కూడా తెలంగాణకు నష్టం చేయబోరని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఆరు గ్యారంటీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై చర్చించే సత్తా ఉందా అని నిలదీశారు. గ్యారంటీలపై, మహిళలకు, పింఛన్లు పొందే అవ్వాతాతలకు చేసిన మోసంపై చర్చిద్దామా అన్నారు. 2016లో అసలు పోలవరం – బనకచర్ల లింక్ ప్రాజెక్టు అనే ప్రస్తావనే లేదన్నారు. అబద్ధాలు ఆడటం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రేవంత్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తించి హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించకుండా ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీని ప్రజలు క్షమించబోరని అన్నారు.
పింఛన్లు పెంచాలని, మహిళలకు రూ.2,500 ఇవ్వాలని సోనియాగాంధీకి పోస్టు కార్డులు
సోనియాగాంధీ ఎన్నికలకు ముందు తెలంగాణ వచ్చి హామీ ఇచ్చారు కాబట్టే ప్రజలు నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సోనియాగాంధీ హామీ ఇచ్చినట్టుగా మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వాలని, వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఇతర పింఛన్ లబ్ధిదారులకు నెలకు రూ.4 వేలు, వికలాంగులకు నెలకు రూ.6 వేల పింఛన్ ఇచ్చేలా రేవంత్ రెడ్డికి సోనియా గాంధీ ఆదేశాలు ఇవ్వాలన్నారు. ఇందుకోసమే సోనియాగాంధీకి వేలాది పోస్టు కార్డులు రాస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తయినా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. సోనియాగాంధీ సంతకం పెట్టిన గ్యారంటీ కార్డులను ఎన్నికలకు ముందు ఇంటింటికీ పంపి ప్రజలను మోసం చేశారన్నారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, నాయకులు మహేందర్, సంపత్ గౌడ్, రూప్ సింగ్, అర్చనా సేనాపతి, లలిత యాదవ్, మనోజా గౌడ్, శోభ, లావణ్య, కవిత, పరమేశ్వరి, రజిత రెడ్డి, ఈగ సంతోష్, మనోజ్ గౌడ్, నరేందర్ యాదవ్, రాము యాదవ్, మహేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
