హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని ఈ ప్రాజెక్టుపై సీబీఐ విచారణ చేయాలని మాజీ మంత్రి నాగం జనార్ధనరెడ్డి సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అయితే నాగం వేసిన పిటీషన్ను బుధవారం సుప్రీం కోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాలలో జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం విచారించింది. దాదాపు ఐదేళ్లుగా విచారణ కొనసాగుతున్న ఈ పిటిషన్కు నేడు తెర పడింది.

పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు మేఘా ఇంజినీరింగ్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో దీనికి సంబంధించి ఐదు పిటిషన్లు కొట్టివేయబడ్డాయని రోహిత్గీ సుప్రీం ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఇందులో ఎలాంటి మోసం లేదని, అవకతవకలు లేవని సివిసీ నివేదికలో కూడా తేల్చిందని ఆయన ధర్మాసనానికి తెలిపారు. ఎస్టిమేట్లు పెరిగిన విషయాన్ని తప్పుగా చూపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా బీహెచ్ఈఎల్ (BHEL) వంటి కీలక భాగస్వామి సంస్థ కూడా ఎలాంటి ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు డాక్యుమెంట్లను ఆధారంగా చేసుకొని ఈ కేసులు వేయడం దురుద్దేశపూరితమని ముకుల్ రోహిత్గీ పేర్కొన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ సజావుగా కొనసాగుతోందని, అభివృద్ధికి ఇది కీలకమైందని అన్నారు.

నాగం తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించినా, కోర్టు వాటిని సమర్థించకపోవడంతో పిటిషన్ను తిరస్కరించింది. కాగా కృష్ణా జలాలను ఎత్తిపోసి, నీటి కొరతతో ఇబ్బందిపడుతున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు నీటి అవసరాలను తీర్చే ఉద్దేశంతో రూపొందించిన ఈ ప్రాజెక్టు, ప్రపంచంలోనే అత్యంత భారీ పంపులతో నిర్మితమైన అత్యాధునిక ఎత్తిపోతల వ్యవస్థగా నిలవనుంది.

Updated On 23 May 2025 1:48 PM IST
Politent News Web 1

Politent News Web 1

Next Story