రాయల్ ఛాలెంజే తాగను.. ఆర్సీబీ కొంటానా? - డీకే శివకుమార్

కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతోనే ఓ విస్కీ బ్రాండ్ను తాను తాగనంటూ కుండబద్దలు కొట్టారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును మీరు కొంటున్నారటగా.. అని మీడియా క్వశ్చన్ చేసిన సమయంలో డీకే శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదని తీవ్రంగా ఖండించారు. ఈ యేడాది ఆర్సీబీ జట్టు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ఈ ఫ్రాంచైజీని అమ్మబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ పేరు కూడా చర్చల్లోకి వచ్చింది.
ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడిన డీకే శివకుమార్.. ఈ ప్రచారంపై తనదైన రీతిలో రెస్పాండ్ అయ్యారు. "నాకు ఆర్సీబీ ఎందుకు? నేను రాయల్ ఛాలెంజ్ (విస్కీ బ్రాండ్ పేరును ప్రస్తావిస్తూ) కూడా తాగను" అని డీకే చమత్కరించారు. "ఐపీఎల్ ఫ్రాంచైజీని కొనడానికి నేనేమీ పిచ్చివాడిని కాను. నాకు అలాంటి ఆలోచనే లేదు" అని ఆయన తేల్చిచెప్పారు.
ఆర్సీబీ అమ్మకం, కొనుగోలు విషయం అటు ఉంచితే.. ఇప్పుడు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇటు పొలిటికల్ సర్కిల్స్లో.. అటు స్పోర్ట్స్ సర్కిల్స్లో వైరల్గా మారాయి.
