ఉత్తరప్రదేశ్ పోలీసులు నేరస్థులపై మళ్లీ ఉక్కుపాదం మోపారు. గడిచిన 24 గంటల్లో మొత్తం 14 ఎన్కౌంటర్లు చేశారు. ఈ ఎన్కౌంటర్లలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్కు చెందిన ఒక కరడుగట్టిన నేరస్థుడు హతమవగా, చాలామంది నేరస్తులను కాళ్లపై కాల్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలతో పాత నేరస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పలువురు నేరస్తులు స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోతున్నారు.
యూపీకి చెందిన ఎస్టీఎఫ్, ఢిల్లీ స్పెషల్ సెల్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో లారెన్స్ గ్యాంగ్కు చెందిన నవీన్ అనే షార్ప్షూటర్ను హాపూర్లో ఎన్కౌంటర్ చేసి హతమార్చారు. అతనిపై ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్లో పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులు చుట్టుముట్టేసరికి నవీన్ కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. దీంతో నవీన్ హతమయ్యాడు. ఇక లక్నోలో, బాలికపై అత్యాచారం చేసి పరారీలో ఉన్న నేరస్థుడు కమల్ కిషోర్ను మదేగంజ్ వద్ద పట్టుకునే ప్రయత్నంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో కమల్ కిషోర్ గాయపడ్డాడు.
ఇక, ఘజియాబాద్లో, ఓ నేరస్థుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జలౌన్ జిల్లా కొంచ్ ప్రాంతంలో నవీన్ జ్యువెలర్స్ దుకాణాన్ని దోచిన నిందితుల్లో ఒకడైన అజయ్ కుష్వాహా.. పోలీసులపైకి కాల్పులు జరిపాడు. పోలీసులు అతని కాలిపై కాల్చగా, అతని తోడుగా ఉన్న రాము కుష్వాహా భయంతో లొంగిపోయాడు. అటు.. ఉన్నావ్ జిల్లాలో మరో నేరస్థుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నేరస్థులు పారిపోయారు.
బులంద్షహర్లో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని ఖుర్జా దేహత్ పోలీసులు ఎన్కౌంటర్లో గాయపరిచి అరెస్ట్ చేశారు. బాగ్పత్లో ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకోగా, ఆగ్రాలో బుధవారం రాత్రి మరో నేరస్థుడిని కాలిపై కాల్చి పట్టుకున్నారు. ఝాన్సీలో రూ.25,000 రివార్డు ఉన్న మరో నిందితుడిని మాత్ కొత్వాలి పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. బల్లియాలో గంట వ్యవధిలో రెండు ఎన్కౌంటర్లలో ఇద్దరు నేరస్థులను గాయపరిచి అరెస్ట్ చేశారు. సహారన్పూర్లో భట్టా మునిమ్ను దోచిన నిందితులను షామ్లి పోలీసులు పట్టుకున్నారు. హాపూర్లో మరో ఎన్కౌంటర్లో నలుగురు దుండగులు గాయపడ్డారు. వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో ఒకరికి కాలికి గాయం కాగా, మరొకరు కాల్చి చంపుతారన్న భయంతో లొంగిపోయారు.
ముజఫర్నగర్లో ముగ్గురు నేరస్థులను కాలిపై కాల్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్నోలోని అలంబాగ్లో కూడా ఓ నేరస్థుడిని ఎన్కౌంటర్లో గాయపరిచి పట్టుకున్నారు. యూపీలో దూకుడు పెంచిన పోలీసుల చర్యలతో నేరస్థులు భయంతో ఒక్కొక్కరుగా లొంగిపోతుండటం రాష్ట్ర వ్యాప్తంగా గంభీర వాతావరణం సృష్టిస్తోంది.
