ఆపరేషన్‌ సింధు ద్వారా ఇప్పటి వరకూ ఇరాన్‌ నుంచి మొత్తం 2858 మందిని స్వదేశానికి తిసుకువచ్చినట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బుధవారం ఉదయం ఇరాన్‌ నుంచి 282 మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు. ఇరాన్‌ దేశంలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యలో ఆ దేశంలో ఉన్న భారత విద్యార్థులను, పౌరులను ఆపరేషన్‌ సింధు పేరుతో స్వదేశానికి రప్పించే కార్యక్రమం భారత ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగానే బుధవారం తెల్లవారుజామున భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 282 మంది ప్రయాణికులతో చేరింది. అయితే ఇరాన్‌ నుంచి ఇండియా చేరుకుంటున్న వారందరికీ ఆరోగ్య పరిక్షలు నిర్వహించిన తరువాతే వారి సొంత ఊర్లకు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. ఇరాన్‌ నుంచి ఇండియా చేరుకున్న భారతీయులందరికీ ఎయిర్ పోర్ట్‌ నుంచి సొంత ఊళ్ళకు వెళ్లడానికి అవసరమైన సహాయ సహకారాలు కూడా విదేశాంగ మంత్రిత్వ శాఖే అందిస్తోంది.

ఇరాన్‌, ఇజ్రాయిల్‌ దేశాల మధ్య భీకర యుద్దం జరుగుతున్న పరిస్ధితుల్లో ఇరాన్‌ దేశంలో నివశిస్తున్న భారత సంతతికి చెందిన విద్యార్థులు, కార్మికులు, పర్యాటకులతో సహా వేలాది మంది భారతీయులను ఇండియా సురక్షితంగా తీసుకు రావడానికి ఆపరేషన్‌ సింధు ని ఈ జూన్‌ మాసారంభంలోనే ప్రారంభించారు. టెహ్రాన్, ఎస్ఫహాన్ మరియు మషాద్‌లోని భారత రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుని భారత వైమానిక దళ విమానాలు, ఇతర వాణిజ్య విమానాల ద్వారా ఇరాన్‌ లో చిక్కుకున్న భారత్‌ పౌరులను సురక్షితంగా ఇండియా తీసుకువస్తున్నారు. తమకు ప్రతి భారతీయుడి జీవితం విలువైనదే అని, విదేశాలలో ఉన్న భారత్‌ పౌరుల భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చెపుతున్నారు.

Politent News Web 1

Politent News Web 1

Next Story