ఒకే వేదికపై ఐదుగురు గవర్నర్లు, ఇద్దరు సీఎంలు, మాజీ రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

హైదరాబాద్లో ఆదివారం అత్యంత అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఐదు రాష్ట్రాల గవర్నర్లు ఒకే వేదికపై కనిపించారు. అంతేకాదు.. మాజీ రాష్ట్రపతి, మాజీ ఉప రాష్ట్రపతి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదే వేదికపై కనిపించడం ఆసక్తికరంగా మారింది.
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తాకావిష్కరణ కార్యక్రమంలో ఈ దృశ్యం ఆవిష్కృతమయ్యింది. బండారు దత్తాత్రేయ ఆటోబయోగ్రఫీ ‘ప్రజలకథే నా ఆత్మకథ’ను ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు. దత్తాత్రేయ తన 70 ఏళ్ల జీవిత గమనాన్ని ఈ ఆత్మకథ పుస్తకంలో చేర్చారు. అనంతరం ఆ పుస్తక ప్రతులను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆత్మకథ ఆవిష్కర్త హరియాణా గవర్నర్ దత్తాత్రేయతో పాటు.. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఇక, మాజీ రాష్ట్ర పతి రామ్నాథ్ కోవింద్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించగా.. తొలి ప్రతిని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకున్నారు. ఇలా.. ఇంతమంది ప్రముఖులు ఒకే వేదికపై ఆసీనులు కావడం అత్యంత అరుదైన సందర్భంగా ప్రతి ఒక్కరూ పేర్కొంటున్నారు.
పైన చెప్పుకున్న ప్రముఖులతో పాటు.. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి, తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేతలు కె.కేశవరావు, వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
