ప్రజలందరూ యోగాదినోత్సవంలో భాగస్వాములు కావాలి… ప్రధాని మోడీ

ఈనెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చారు. వరల్డ్ యోగాదినోత్సవాన్నిపురస్కరించుకుని సందేశమిస్తూ ప్రధాని మోడీ దేశప్రజలను ఉద్దేశించి లేఖ విడుదల చేశారు. ఈ సంవత్సరం జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం దేశవ్యాప్తంగా ఘనంగా జరపుకోనున్నామని లేఖలో తెలిపారు. ఆరోజు జరిగే యోగా ప్రదర్శనల్లో ప్రజలందరూ మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలందరూ పెద్దయెత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. యోగా చారిత్రాత్మక ప్రస్ధానం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని నిర్ణయించామని అన్నారు. గడచిన దశాబ్దకాలంగా దేశప్రజలందరూ ఈ గొప్ప కార్యకర్రమానికి అందిస్తున్న ఆదరణ అనిర్వచనీయమన్నారు. గత పదేళ్ళుగా యోగా భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాలపై సానుకూల ప్రభావం చేపించడం మన దేశానికి గర్వకారణమన్నారు
ఈ ఎడాది జూన్ 21న విశాఖపట్నం కేంద్రంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని "యోగా.. ఒక భూమి, ఒక ఆరోగ్యం అనే థీమ్ తో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. యోగా కేవలం వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా, మానవత్వం, పర్యావరణ పరిరక్షణ, మరియు ప్రపంచ ఐక్యత స్ఫూర్తిని కూడా ప్రతిబింబిస్తుందన్నారు. యోగా మన గొప్ప సాంస్కృతిక వారసత్వంలో అంతర్భాగమని,ఇది శరీరం మరియు మనస్సు మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో సహాయ పడుతుందన్నారు. అంతేకాకుండా యోగా సమగ్రమైన,ప్రశాంతమైన మరియు సంతృప్తికరమైన జీవనశైలి వైపు మనకు మార్గనిర్దేశం చేస్తుందన్నారు.
ఈ మహత్తర కార్యక్రమంలో అందరూ పాల్గొనేలా,బహిరంగ ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా పంచాయితీ భవన్, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి ప్రదేశాల్లో నిర్వహించాలని సూచించారు. దీనివల్ల పిల్లలు,యువత, మహిళలు మరియు పెద్దలు సహా అన్ని వర్గాల ప్రజలు యోగా వల్ల ప్రయోజనాలు పొంది,ఆరోగ్యవంతమైన జీవనశైలిని అలవరుచు కోగలరన్నారు.అందరం కలిసి ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంతో ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా చేసుకోవడానికి గొప్ప ప్రేరణనిస్తుందని తాను గట్టిగా విశ్వసిస్తున్నానన్నారు.యోగా ద్వారా వారు మరింత ఆరోగ్యకరమైన,ప్రశాంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ఆశిస్తున్నానని ఆ లేఖలో పేర్కొన్నారు.
