కామాఖ్య ఆలయంలో జూన్ 22 నుంచి అంబుబాచి మేళా
Ambubachi Mela at Kamakhya Temple from June 22 to 26th

మహా కుంభమేళా గురించి మనకందరికీ తెలుసు కానీ అలాంటి వైభవోపేతమైన మేళా మరోటి ఉందని చాలా మందికి తెలియదు. ఈశాన్య భారతంలో జరిగే ఆ మహాకుంభ్ను అంబుబాచి మేళా అంటారు. ఈ మేళా కోసం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. తాంత్రిక పూజలు చేయడం కోసం సిద్ధులు వెళతారు. భక్తి పూర్వక విన్యాసాలు చేయడానికి సాధువులు సంసిద్ధమవుతారు. అసోంలోని గౌహతికి దగ్గరలో బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్న కామాఖ్యదేవి ఆలయంలో జరుగుతుందీ మేళా. ఈ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాలలో అత్యంత శక్తివంతమైనది. కామాఖ్య కుంభమేళగా భక్తులు పిల్చుకునే ఈ మేళ కుంభమేళ అంత గొప్పగా జరుగుతుంటుంది.
ఈ క్షేత్రంలో కొలువైన కామాఖ్యాదేవికి నెలలో మూడు రోజులు రుతుస్రావం జరుగుతుంది. ఈ ఆలయ విశిష్టత ఇదే. మృగశిర నక్షత్రం మూడో పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలోని మొదటి పాదం వరకు అమ్మవారి రుతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు.. అస్సామీయుల క్యాలెండర్ ప్రకారం అహార్ నెలలోని ఏడో రోజున ఈ మేళ ప్రారంభం అవుతుంది. దేవి భాగవతంలో ఈ ప్రత్యేక రోజుల ప్రస్తావన ఉంది కూడా! ఈ మూడు రోజులు యోని శిల నుంచి ఎర్రని స్రావం వెలువడుతుంది. శక్తిపీఠం ఎదురుగా ఉన్న సౌభాగ్య కుండంలోని నీరు కూడా ఎరుపురంగు సంతరించుకుంటుంది. ఈ మూడు రోజుల పాటు ఆలయాన్ని మూసి ఉంచుతారు. నాలుగో రోజున పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఉత్సవం తర్వాతే ఆలయాన్ని తెరుస్తారు. అంబుబాచి మేళకు ముందే భక్తులు అమ్మవారికి వస్త్రాలను సమర్పించుకుంటారు. ఆ వస్త్రాలను అమ్మవారి శిలపై ఉంచుతారు. ఆ తర్వాత వాటిని పూజారులు పార్వతీకుండంలో చక్కగా ఉతికి ఆరబెడతారు. అటు పిమ్మట వేలం పద్దతిలో వాటిని మళ్లీ భక్తులకే విక్రయిస్తారు. ఆ వస్త్రాలు దగ్గరుంటే రుతుస్రావ దోషాలు అంటవన్నది భక్తుల బలమైన నమ్మకం. అయిదు రోజులపాటు జరిగే ఈ మేళా కోసం ఎక్కడెక్కడి నుంచో వేలాదిమంది పండాలు, సిద్ధులు, తాంత్రికులు వస్తారు. అఘోరాలు కూడా వస్తుంటారు. తప్పెట్లు, తాళాలు వాయించుకుంటూ సిద్ధులు చేసే విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. జడలు కట్టిన బారెడు జట్టుతో ఉన్న సాధువులు, సాధ్విలు పెట్టే అభయముద్రలు అద్భుతంగా ఉంటాయి. అంబుబాచి మేళ జరుగుతున్నప్పుడే కాదు, మామూలు రోజుల్లో కూడా సాధువులు, సంతులు, అఘోరాలు, తాంత్రికులు ఈ ఆలయానికి వస్తుంటారు. అందుకు కారణం మంత్ర, తంత్ర, ఐంద్రజాలాలకు కామాఖ్యాక్షేత్ర శక్తిపీఠం కేంద్రస్థానం కాబట్టి! విచిత్రమేమిటంటే ఇక్కడికి వచ్చే సాధువుల్లో చాలామంది ఆ తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించరు. ఎక్కడినుంచి వస్తారో, ఎక్కడికి వెళతారో ఎవరికీ తెలియదు. అదో అంతుపట్టని రహస్యం.,
గౌహతికి దగ్గరలోనే ఉన్న నీలాచల పర్వతాలపై ఈ కామాఖ్యదేవి ఆలయం ఉంది. ఇక్కడి అమ్మవారిని త్రిపుర శక్తిదాయినిగా కొలుచుకుంటారు. కామరూపిణిగా పిలుచుకుంటారు. ఈ క్షేత్రంలో అమ్మవారు మూడు ప్రధాన రూపాలలో దర్శనమిస్తుంది.. అసురలను అంతం చేయడానికి త్రిపురభైరవి రూపం ధరిస్తుంది. ఈ రూపాన్ని పరమశివుడు కూడా చూడలేడట! సింహవాహినిగా ప్రసన్నవదనంతో దర్శనమిస్తుంది. ముక్కంటిపై అనురాగంతో త్రిపురసుందరిగా మారుతుంది. ఇంకా అనేక రూపాలలో దర్శనమిస్తుంది ఆ తల్లి! అంబుబాచి మేళ సందర్భంగా ప్రధాన ఆలయ తలుపులే కాదు, నీలాచల పర్వతంపై ఉన్న అన్ని గుడి తలుపులు మూసుకుంటాయి. ఆ మూడు రోజులపాటు అక్కడ ప్రార్థనలు జరగవు. దేవి స్తోత్రాలు చదవరు. ఇతర పూజాధికాలు జరగవు. స్థానిక ప్రజలు వివాహాది శుభకార్యాలను కూడా జరుపుకోరు. నాలుగో రోజున గుడి ద్వారాలు తెరుచుకుంటాయి. అమ్మవారి దివ్యదర్శనం కోసం భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. అప్పుడక్కడ తీర్థప్రసాదాలు ఉండవు.. భక్తులకు ఇచ్చే ప్రసాదం కాసింత పవిత్ర జలం, ఓ ఎర్రని సిల్కు వస్త్రం ముక్క. దీన్ని రక్తవస్త్ర అని, అంగవస్త్ర అని పిలుచుకుంటారు. ఈ వస్త్రం అందరికి లభించదు. దొరికిన వారు మహా అదృష్టవంతులు. ఈ వస్త్రం ఉన్న ఇంట్లో ఎలాంటి చెడులు జరగవు. అంతా శుభమే జరుగుతుందని, ఆ ఇంటివారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.
అంబుబాచి మేళాను చూసేందుకు విదేశీ పర్యటకులు కూడా వస్తుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. నీలాచల్ పర్వత ప్రాంతాలకు చేరుకోగానే ఓ రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందని చెబుతుంటారు. కాలినడకన ఎంత దూరం ప్రయాణించినా భక్తులకు ఎలాంటి అలసట కలగదట! యోనికి పూజలు జరిపే ఇలాంటి ఆలయం మరెక్కడా లేదు! దక్షుడి యజ్ఞవాటికలోనే సతీదేవి ప్రాణాలు అర్పించుకోవడం, సతీ వియోగాన్ని తట్టుకోలేక పరమశివుడు వియోగిగా మారడం, సతీదేవి దేహంలోని ఒక్కో భాగం ఒక్కో పుణ్యక్షేత్రంగా వెలిసి అష్టాదశ పీఠాలుగా ప్రసిద్ధిగాంచిన విషయం మనకు తెలిసిందే. అమ్మవారి యోని భాగం నీలాచలంపై పడింది. సృష్టికి మూల కారణమైన స్థానం కాబట్టి ఈ ప్రదేశం అన్ని శక్తిపీఠాల్లోకెల్లా అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. అన్ని శక్తిపీఠాలకు ఇదే ఆధారస్థానం. ఈ శక్తిపీఠాన్ని మహాయోగ స్థలమని పిలుస్తారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అమ్మవారు విగ్రహరూపంలో దర్శనం ఇవ్వరు. అక్కడి రాతి యోనిలోనే కామాఖ్యాదేవి నివాసం ఉంటుందని అంటారు. ముక్కోటి దేవతలు పర్వతరూపంలో ఉంటూ అమ్మవారిని సేవించుకుంటూ ఉంటారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయానికి స్థలపురణాలు ఎన్నో ఉన్నాయి. అమ్మవారు ఎక్కడుంటే అయ్యవారు కూడా అక్కడే ఉండాలి కాబట్టి ఇక్కడ శివుడు ఉమానంద భైరవుడిగా కొలువుతీరాడు. రెండు నీలాచల పర్వతాల మధ్యన ఆదిమతెగలకు చెందిన శాక్తీయులు ఉంటారు. వారే ఈ దేవిని ఎక్కువగా ఆరాధిస్తారు. ఇప్పటికీ వీరు మాతృస్వామ్య వ్యవస్థనే పాటిస్తారు.. అంబుబాచి మేళాలో వీరు మేకపోతులనే బలి ఇస్తారు తప్పితే ఆడ జంతువులను బలి ఇవ్వరు.
