సువేందుతో మమతా ఢీ.. భవానీపుర్‌లో తలపడనున్నారు


Big Decision by Trinamool Congress: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ 74 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు షాకిచ్చారు. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు నిరాకరించారు. మంగళవారం ఆమె 291 మంది అభ్యర్థులతో జంబో జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆ 74 మందికి చోటు దక్కలేదు.

కాళీఘాట్‌లోని తన నివాసంలో మమతా బెనర్జీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కోవడం, పాత-కొత్తల కలయిక, సంస్థాగత సమతుల్యత, భాజపా దూకుడుకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై ఆమె ప్రాధాన్యం ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన మమతా.. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 291 చోట్ల తాము పోటీ చేస్తున్నామని, మిగిలిన మూడు సీట్లను డార్జీలింగ్‌ హిల్స్‌లోని భారతీయ గూర్ఖా ప్రజాతాంత్రిక్‌ మోర్చాకు కేటాయించామని తెలిపారు.

తృణమూల్‌కు ప్రస్తుతం 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 135 మందికి మళ్లీ టికెట్లు దక్కాయి. 15 మంది ఎమ్మెల్యేల సీట్లు మార్చారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో తనను ఓడించిన భాజపా నేత సువేందు అధికారిపై మమతా ఈసారి కూడా పోటీకి దిగుతున్నారు. అయితే ఈసారి ఇద్దరూ భవానీపుర్‌ నియోజకవర్గం నుంచి తలపడనున్నారు. నందిగ్రామ్‌లో పవిత్ర కర్‌కు తృణమూల్‌ టికెట్ ఇచ్చింది. అక్కడ సువేందు అధికారి పోటీ చేస్తున్నారు.

ఈ జాబితాలో యువ నేతలు, మహిళలు, సామాజిక సమతుల్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు మమతా తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.

Next Story