నేటినుంచి నిలిచిపోయిన బైక్ ట్యాక్సీలు
Bike taxis suspended from today

బైక్ ట్యాక్సీలు కొన్నేళ్లుగా ప్రజలకు ఎంతో దగ్గరైన సర్వీసులు. క్యాబ్లు, ఆటోల కంటే బైక్ ట్యాక్సీలతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వీటిని వినియోగించుకుంటున్నారు. అయితే, ఇవాల్టి నుంచి ఆ బైక్ ట్యాక్సీ సర్వీసులు నిలిచిపోయాయి. ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థలకు చెందిన అన్ని బైక్ ట్యాక్సీ సర్వీసులు నిలిపేశారు. అయితే, మన తెలుగు రాష్ట్రాల్లో కాదు. కర్నాటకలో బైక్ట్యాక్సీ సర్వీసులు బంద్ అయ్యాయి.
కర్నాటక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సర్వీసులను ఉబర్, ఓలా, ర్యాపిడో సంస్థలు నిలిపేశాయి. హైకోర్టు ఆదేశాల మేరకే తాము బైక్ ట్యాక్సీ సర్వీసులు నిలిపేశామని ర్యాపిడో ప ్రకటించింది. తమ సర్వీసులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి మంతనాలు సాగిస్తున్నామని ప్రకటించింది. బైక్ ట్యాక్సీ సర్వీసులను ఉబర్ మోటో కొరియర్ కిందకు మార్చగా.. ఓలా తన యాప్లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్ను పూర్తిగా తొలగించింది.
మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేకపోవడంతో ఈ సర్వీసులను బంద్ చేయాలని కర్ణాటక హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ అంశంపై క్యాబ్ సర్వీసు సంస్థలు డివిజన్ బెంచ్లో సవాల్ చేయగా.. డివిజన్ బెంచ్ కూడా సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థించింది. సోమవారం నుంచి బైక్ ట్యాక్సీ సేవలు నిలిపివేయాలని ఆదేశించింది. జూన్ 20లోగా దీనిపై తమ స్పందన తెలియజేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో బైక్ ట్యాక్సీ సర్వీసులు నిలిచిపోయాయి. బైక్ ట్యాక్సీలపై నిషేధం వల్ల గిగ్వర్కర్ల జీవితాలు రోడ్డునపడతాయంటూ నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్ సీఎం సిద్ధరామయ్య, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి లేఖ రాసింది. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరింది.
