Congress Denies Charge: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించే సమయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది.

బీజేపీ అధికార ప్రతినిధి గోపాల్‌ కృష్ణ అగర్వాల్‌ ఎక్స్‌లో ఒక వీడియోను పంచుకుంటూ, ‘‘వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. వందేమాతరం కేవలం గేయం మాత్రమే కాదు. స్వాతంత్య్ర పోరాటం, జాతీయ చైతన్యం, దేశభక్తికి ప్రతీక. కాంగ్రెస్‌ వైఖరి అత్యవసర పరిస్థితి నాటి ధోరణిని గుర్తు చేస్తోంది’’ అని విమర్శించారు. మరో బీజేపీ ప్రతినిధి ఆర్పీ సింగ్‌ కూడా సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేసి పార్టీ కార్యకర్తలను ఆపాలని కోరారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. పార్టీ నేత జైరాం రమేశ్‌ స్పష్టం చేస్తూ, వందేమాతరం పూర్తి గేయాన్ని ఆపే ప్రయత్నం ఏమీ జరగలేదని తెలిపారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలాసేపు నిల్చొని ఉండటంతో ఆయనకు కుర్చీ తీసుకురావాలని సోనియా గాంధీ సైగ చేశారని వివరించారు. దీనిని బీజేపీ రాజకీయం చేస్తోందని ఆయన మండిపడ్డారు. వందేమాతరం ఆలాపనపై కాంగ్రెస్‌కు స్పష్టమైన విధానం ఉందని కూడా జైరాం రమేశ్‌ స్పష్టం చేశారు.

ఈ వివాదం స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

PolitEnt Media

PolitEnt Media

Next Story