Canada Government: కెనడా ప్రభుత్వం: హింసకు భారత్తో సంబంధం లేదు – సంబంధాలు మెరుగవుతున్నాయి
సంబంధాలు మెరుగవుతున్నాయి

Canada Government: కెనడాలో గతంలో జరిగిన హింసాత్మక ఘటనలకు భారత్కు ఎలాంటి సంబంధం లేదని కెనడా ప్రభుత్వం స్పష్టంగా ప్రకటించింది. ఇరు దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు ఇప్పుడు మెరుగుపడుతున్నాయని వెల్లడించింది.
కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ వివరణ వచ్చింది. మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో హయాంలో భారత్పై చేసిన ఆరోపణలపై కెనడా ప్రభుత్వం ఇప్పుడు స్పష్టత ఇచ్చింది. ఆ ఆరోపణలపై ఇక విచారణలు లేదా ఇతర చర్యలు కొనసాగించడం లేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
2023లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్లు పాత్ర ఉందని ట్రూడో ఆరోపించారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దౌత్యవేత్తల బహిష్కరణలతో వివాదం మరింత పెరిగింది. అయితే, మార్క్ కార్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంబంధాలు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి.
ఈ పర్యటనలో వాణిజ్యం, ఇంధనం, టెక్నాలజీ, పెట్టుబడులు, కీలక ఖనిజాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ప్రజల మధ్య సంబంధాలపై చర్చలు జరగనున్నాయి. ముంబయిలో మొదలైన పర్యటనలో కార్నీ కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక నిపుణులు, ఆవిష్కర్తలతో భేటీ అవుతారు. ఆదివారం ఢిల్లీ చేరుకుని, సోమవారం భారత ప్రధానితో కీలక చర్చలు నిర్వహిస్తారు.

