Rahul Gandhi: లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యార్థుల ఆందోళనపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ వీధుల్లో జరిగింది కేవలం నిరసన కాదని, విద్యార్థుల భావ వ్యక్తీకరణ, వేదన అని పేర్కొన్నారు.

పేపర్ లీక్ ఘటనలతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురయ్యారని, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు రెచ్చగొట్టి లాఠీఛార్జ్ చేశారని మండిపడ్డారు. “మూర్ఖులు ఎవరి మాటలు వినరు. ప్రభుత్వం మా ఆవేదనను పట్టించుకోవడం లేదు” అని విద్యార్థులు తనతో చెప్పారని రాహుల్ తెలిపారు. కేంద్రం విద్యార్థుల నిరసనను అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వ్యవహరించిందని విమర్శించారు.

విద్యా వ్యవస్థ ప్రస్తుతం ఖరీదైన వ్యాపారంగా మారిందని, ప్రైవేటీకరణ విచ్చలవిడిగా జరుగుతోందని అన్నారు. ఈ వ్యవస్థను నడిపిస్తోంది ఆర్‌ఎస్‌ఎస్ అని ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ కేవలం సింబల్ మాత్రమేనని, విద్యార్థులకు అసలైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్ అని పేర్కొన్నారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగం, అణచివేతకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు.

రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో అనుచిత పదాలు, అమిత్ షా, ఆర్‌ఎస్‌ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కిరణ్ రిజిజు తదితరులు డిమాండ్ చేశారు. దీంతో స్పీకర్ కొన్ని వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించారు.

బీజేపీ ఎంపీలు కావాలనే తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారని, సభలో కేవలం వారు మాత్రమే మాట్లాడాలనడం సరికాదని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story