Uddhav Thackeray: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం సాధించిన నేపథ్యంలో, శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు, కుట్రలతోనే బీజేపీ గెలిచిందని ఆయన ఆరోపించారు. ముంబైని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని, దాన్ని తాకట్టు పెట్టాలని బీజేపీ చూస్తోందని ధ్వజమెత్తారు.

ఈ విజయంతో తమను పూర్తిగా బలహీనపరిచామని బీజేపీ నేతలు అనుకుంటున్నారని, అలాంటిది ఎప్పటికీ జరగదని ఉద్ధవ్ స్పష్టం చేశారు. యుద్ధం ఇంకా ముగియలేదు, ఇప్పుడే ప్రారంభమైందని ఆయన అన్నారు. బీజేపీ కుట్రలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో 64 స్థానాలు సాధించిందని తెలిపారు. ముంబైలో శివసేన (యూబీటీ) నుంచి మేయర్‌ను నియమించాలనేది తన కల అని, అది సాకారమవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)లో మొత్తం 227 సీట్లు ఉండగా, అధికారానికి 114 సీట్లు అవసరం. బీజేపీ-శివసేన (ఏక్‌నాథ్ శిందే వర్గం) కూటమి ఈ మార్కును మించి సీట్లు సాధించింది. బీజేపీ 89 స్థానాలు, శిందే శివసేన 27 స్థానాలు గెలుచుకున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే వర్గం 64 సీట్లు పొందింది. రెండు దశాబ్దాలుగా విడిపోయి ఉన్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవనిర్మాణ సేనా) ఈ ఎన్నికలకు ముందు జట్టుకట్టినప్పటికీ, మహాయుతి విజయాన్ని అడ్డుకోలేకపోయారు. ఈ ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తీసుకురానున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story