CRPF Issues Notice to Rahul Gandhi: భద్రతా నియమాలు ఉల్లంఘించిన రాహుల్ గాంధీపై సీఆర్పీఎఫ్ నోటీసు
సీఆర్పీఎఫ్ నోటీసు

CRPF Issues Notice to Rahul Gandhi: లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా భద్రతా ప్రోటోకాల్లను ఉల్లంఘించారని ఆరోపిస్తూ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) ఆయనకు, అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు లేఖ రాసింది. సీఆర్పీఎఫ్ వీవీఐపీ సెక్యూరిటీ చీఫ్ సునీల్ జూన్ రాసిన ఈ లేఖలో, రాహుల్ గాంధీ తన భద్రతను సీరియస్గా తీసుకోవడం లేదని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా విదేశాలకు ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ ఇటీవల చేసిన విదేశీ పర్యటనలను లేఖలో వివరించారు. ఇటలీ (డిసెంబర్ 30 నుంచి జనవరి 9), వియత్నాం (మార్చి 12 నుంచి 17), దుబాయ్ (ఏప్రిల్ 17 నుంచి 23), ఖతార్ (జూన్ 11 నుంచి 18), లండన్ (జూన్ 25 నుంచి జులై 6), మలేషియా (సెప్టెంబర్ 4 నుంచి 8) వంటి దేశాల్లో ఆయన ప్రోటోకాల్కు విరుద్ధంగా పర్యటించినట్లు సీఆర్పీఎఫ్ ఆరోపించింది.
ప్రస్తుతం రాహుల్ గాంధీకి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)తో Z+ కేటగిరీ భద్రతను కల్పిస్తున్నట్లు సీఆర్పీఎఫ్ అధికారి తెలిపారు. Z+ ASL అనేది అత్యధిక ప్రమాదం ఉన్న వ్యక్తులకు అందించే అత్యున్నత రక్షణలలో ఒకటిగా పేర్కొన్నారు. దాదాపు 55 మంది భద్రతా సిబ్బంది, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోలతో సహా, రాహుల్ గాంధీ భద్రత కోసం కేటాయించబడ్డారు. ASL కింద స్థానిక పోలీసులు, నిఘా అధికారుల సమన్వయంతో వీఐపీలు సందర్శించే ప్రాంతాల్లో ముందస్తు నిఘా నిర్వహిస్తారని వెల్లడించారు.
2023లో జరిగిన కశ్మీర్ యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీకి ఊహించని విధంగా భారీ జనసమూహం స్వాగతం పలికినప్పుడు భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ సమయంలో రాహుల్ జనసమూహం మధ్య దాదాపు 30 నిమిషాల పాటు కదలలేకపోయారని పార్టీ పేర్కొంది. ఇటీవల, డిసెంబర్ 24న భారత్ జోడో యాత్ర ఢిల్లీలోకి ప్రవేశించినప్పుడు కూడా భద్రతా ఉల్లంఘనలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసిన సంగతి తెలిసిందే.
సీఆర్పీఎఫ్ గతంలోనూ 2020 నుంచి రాహుల్ గాంధీ 113 సార్లు భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆరోపించిన విషయం గమనార్హం.
