Supreme Court: సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

Supreme Court: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాలపై సుప్రీం కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సైబర్ నేరగాళ్లను ‘పరాన్నజీవులు’ అని విశేషించిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అమాయక ఇన్వెస్టర్లను మోసగించి కోట్ల రూపాయలు దోచుకుంటున్న వారిని జైల్లో పెట్టడమే సమాజానికి మంచిదని అభిప్రాయపడ్డారు.
సైబర్ నేరారోపణలు ఎదుర్కొంటున్న ఒక వ్యక్తి వివిధ రాష్ట్రాల్లో తనపై నమోదైన ఎఫ్ఐఆర్లను ఒక్కటిగా కలిపి విచారించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ, “సైబర్ నేరస్థులు ఒక రాష్ట్రంలో పట్టుబడితే మరో రాష్ట్రానికి వెళ్లి అక్కడి ప్రజలను మోసం చేస్తున్నారు. వారిని కఠినంగా శిక్షించాలి” అని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా సైబర్ నేరాల బాధితులు వేల సంఖ్యలో ఉన్నారని, గతేడాది చివరి నాటికి డిజిటల్ మోసాల వల్ల భారతీయులు రూ.3 వేల కోట్లకు పైగా నష్టపోయారని సీజేఐ పేర్కొన్నారు. ఇది సైబర్ నేరాల తీవ్రతను స్పష్టం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్ను సంబంధిత హైకోర్టును ఆశ్రయించాలని సూచించి, పిటిషన్ను విచారణకు తీసుకోవడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
ఈ తీర్పు సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ప్రజలు డిజిటల్ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

