Fatal plane crash in Ahmedabad

గుజరాత్ లోని అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట దాటిన తర్వాత ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలి పోయింది. ఎయిర్పోర్ట్ సమీపంలోనే ఉన్న ఇళ్లపై విమానం కుప్పకూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానం మొత్తం మంటల్లో చిక్కుకుపోయింది. మంటలు కొన్ని మీటర్ల ఎత్తువరకూ దట్టంగా అలుముకోగా.. ఆపై ఆ ప్రాంతాన్నంతా పొగలు కమ్మేశాయి. కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు కూడా ఆ పొగ కనిపించింది. ప్రమాదం గురించి తెలియగానే.. సంఘటనా స్థలానికి అంబులెన్స్లు, ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
గురువారం సరిగ్గా మధ్యాహ్నం 1:17 గంటలకు బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్ విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. విమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదం జరిగిందని అధికారులు, స్థానికులు చెబుతున్నారు. పైకి ఎగరాల్సిన విమానం ఒక్కసారిగా భూమివైపు కిందకు వచ్చి చెట్టును ఢీకొని పరిసరాల్లో ఉన్న భవనాలపై కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సంఘటనాస్థలంలో కొద్ది సేపటి దాకా మంటలు ఎగిసిపడటంతో పాటు.. పొగలు దట్టంగా అలుముకున్నాయి. దీంతో, ఆ ప్రమాదం ఘటనాస్థలం దరిదాపుల్లోకి వెళ్లేందుకు రెస్క్యూ టీమ్లకు కూడా సమస్యగా పరిణమించింది.
విమానం ఇళ్లపైనే కుప్పకూలడం, పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడం పొగలు దట్టంగా అలుముకోవడంతో విమానంలో ఉన్నవాళ్లే కాకుండా.. ఆ ప్రాంతంలో ఉన్న స్థానికులు, ఇళ్లలో ఉన్నవాళ్లు కూడా చనిపోయినట్లు చెబుతున్నారు.
విమానం 828 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలో క్రాష్ అయ్యింది. విమానం కూలిన మేఘాని ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఫైరింజన్లు ఇంకా మంటలు ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానికులు, గాయపడ్డవాళ్లను పలువురిని అంబులెన్సులలో ఆస్పత్రికి తరలించారు.
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమాన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెంటనే స్పందించారు. విమాన ప్రమాదం గురించి తెలియగానే గుజరాత్ ముఖ్యమంత్రి, హోం మంత్రి, అహ్మదాబాద్ పోలీసు కమిషనర్తో ఫోన్లో మాట్లాడారు. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు.. కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. విమాన ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని సూచించారు. అలాగే, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కూడా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు.
అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంలో 242 మంది ఉన్నారని సివిల్ ఏవియేషన్ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) వెల్లడించింది. వీరిలో ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నట్టు తెలిపింది. కెప్టెన్ సుమీత్ సభర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ క్లైవ్ కుందర్ కూడా ప్రమాద సమయంలో విమానంలో ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ స్టేషన్-ఏటీసీకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని, అయితే, తిరిగి ఏటీసీ నుంచి చేసిన కాల్స్కు రెస్పాన్స్ రాలేదని డీజీసీఎ వెల్లడించింది. అహ్మదాబాద్ నుంచి టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిందని, ఎయిర్ పోర్ట్పరిసరాల్లోనే విమాన ప్రమాదం జరిగిందని తెలిపింది.
విమానంలో ఉన్న వారిలో 169 మంది భారతీయులు ఉండగా.. 53 మంది బ్రిటన్ దేశస్తులు ఉన్నారు. విమానంలో ఏడుగురు పోర్చుగ్రీస్ దేశస్థులు, ఒక కెనడా దేశస్థుడు ఉన్నారని అధికారులు వెల్లడించారు. విమానంలో 217 మంది పెద్దలు, 11 మంది చిన్నారులు, ఇద్దరు పసిపిల్లలు ఉన్నారు. తొలుత విమానం శకలాల నుంచి వెలికి తీసిన 40 మృతదేహాలను అహ్మదాబాద్ ఆసుప్రతికి తరలించారు. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ రూపానీ ప్రయాణిస్తున్నట్లు విమానం టికెట్లను బట్టి తెలుస్తోంది. ఈ ఘోర దుర్ఘటనతో అహ్మదాబాద్ ఎయిర్పోర్టును మూసేశారు.
