సింధు నీళ్లపై భారత్ కొత్త ప్లాన్ – పాక్కు వెళ్లే ప్రవాహానికి బ్రేక్
India's new plan for Indus water - a break in the flow to Pakistan

భారత్ సింధు జలాల ఒప్పందాన్ని పునఃసమీక్షిస్తూ, పాకిస్థాన్కు చేరే నీటి ప్రవాహాన్ని తగ్గించేందుకు కీలక వ్యూహాన్ని అమలు చేస్తోంది. జమ్మూ కశ్మీర్లోని అదనపు నీటిని స్వదేశంలోనే వినియోగించే దిశగా కేంద్రం 113 కి.మీ. పొడవైన ఓ భారీ కాలువ నిర్మాణాన్ని పరిశీలిస్తోంది. ఈ కాలువ ద్వారా జలవనరులను పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు మళ్లించాలన్నది కేంద్రప్రభుత్వం ఉద్దేశం.
తూర్పు నదులైన రావి, బియాస్, సట్లెజ్లతో పాటు, సింధు, జీలం, చీనాబ్ వంటి పశ్చిమ నదులపై భారత్కు ఒప్పందంలో కేటాయించిన వాటాను పూర్తిగా వినియోగించేందుకు కేంద్రం పట్టుదలగా ఉంది. ఇది పాకిస్థాన్కు వెళ్లే అదనపు నీటి ప్రవాహాన్ని గణనీయంగా తగ్గించనుంది.
కథువా జిల్లాలోని ప్రతిపాదిత తియే ఉయ్జ్ బహుళార్థ సాధక ప్రాజెక్టును కూడా పునఃప్రారంభం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్ ఉత్పత్తితో పాటు సాగునీరు, తాగునీరు వంటి అవసరాలు నెరవేరనున్నాయి. చీనాబ్ను రావి-బియాస్-సట్లెజ్ నదులతో అనుసంధానించే ప్రతిపాదిత కాలువ ఇప్పటికే ఉన్న జల మార్గాలను జమ్మూ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్లోని 13 ప్రాంతాలతో అనుసంధానించనుంది. ఇందిరా గాంధీ కాలువకు నీటిని సమకూర్చడం కూడా ఈ వ్యూహంలో భాగమే.
రాబోయే మూడేళ్లలో సింధు నీటిని శ్రీ గంగానగర్ వరకూ తీసుకెళ్లి, అక్కడి సాగునీటి అవసరాలు తీర్చబోతున్నామని, ఇది ఒకవైపు దేశ వ్యవసాయాన్ని బలోపేతం చేస్తే, మరోవైపు పాకిస్థాన్కి నీటి కొరత పెంచుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఏప్రిల్లో పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960లో జరిగిన సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి బగ్లిహార్, సలాల్ జలవిద్యుత్ ప్రాజెక్టుల్లో పూడిక తీతతో పాటు, పాకల్ దుల్ (1000 మెగావాట్లు), రాట్లే (850 మెగావాట్లు), కిరు (624 మెగావాట్లు), క్వార్ (540 మెగావాట్లు) ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ, నీటిని పూర్తిస్థాయిలో వినియోగించే దిశగా భారత ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతోంది.
