Iran Attack in the Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడి: భారతీయ నావికుడు మృతి, ఇరాన్ ఉప దౌత్యవేత్తకు భారత్ సమన్స్
ఇరాన్ ఉప దౌత్యవేత్తకు భారత్ సమన్స్

Iran Attack in the Strait of Hormuz: హర్మూజ్ జలసంధిలో యూఏఈ జెండాతో వెళ్తున్న రెండు ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడుల్లో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురు భారతీయ సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ ఢిల్లీలోని ఇరాన్ ఉప దౌత్యవేత్త మహమ్మద్ జావాద్ హొస్సేనీకి సమన్స్ జారీ చేసింది.
పశ్చిమాసియా సముద్ర జలాల్లో వాణిజ్య నౌకాయానానికి పెరుగుతున్న ముప్పుపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల హర్మూజ్లో జరిగిన దాడుల్లో భారతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొంది. జలసంధిలో ఉద్రిక్తతలను తక్షణం తగ్గించాలని, యుద్ధం ముగింపు కోసం అమెరికాతో చర్చలు కొనసాగించాలని టెహ్రాన్ను కోరింది. పశ్చిమాసియాలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని భారత్ ఆకాంక్షించింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా హర్మూజ్లో స్వేచ్ఛాయుత నౌకాయానం త్వరగా పునరుద్ధరించాలని సూచించింది.

