దేశ రహస్యాలు అమ్ముకుంటున్న దేశద్రోహులు సైబర్ దాడులకు పాల్పడుతున్న కంత్రీలు మానవ బాంబులను తయారు చేస్తోన్న ఉగ్రవాదులు

జనం మధ్యలో జగజ్జంత్రీలు తిరుగుతున్నారు. మన చుట్టూరానే దేశ ద్రోహులు షికార్లు చేస్తున్నారు. పక్కనున్న వాళ్లకు కూడా అనుమానం రాకుండా ఉగ్ర కుట్రలు చేస్తున్నారు. ఓ సిరాజ్.. ఓ సమీర్.. ఓ జ్యోతి మల్హోత్రా... వీళ్లంతా బండారం బయటపడి ఆధారాలతో సహా దొరికిన వాళ్లు. మరి.. అనుమానం రాకుండా.. రహస్య కార్యకలాపాలు ఇంకా చేస్తున్న వాళ్లు ఇంకెందరు? దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? దేశ సంస్కృతిని ఎలా చెడగొట్టాలనుకుంటున్నారు? ఇప్పుడీ ప్రశ్నలు దేశ ప్రజలను, దేశ భక్తులను వెంటాడుతున్నాయి.
సిరాజ్ అనే వాడు దేశంపైనే కుట్ర చేశాడు. మానవ బాంబులను తయారు చేసి వీలైనంత మందిని హతమార్చేందుకు ప్లాన్ చేశాడు. జాసిమ్ అన్సారీ అనే వాడు.. యాంటీ ఇండియా గ్రూపులో చేరి దేశంపై సైబర్ వార్కు దిగాడు. మరో కిలాడీ లేడీ.. జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాలను శత్రు దేశానికి అమ్మేసింది. ఈ ముగ్గురే కాదు.. ఇలాంటి మరో 17 మంది దేశద్రోహులను పోలీసులు గుర్తించారు. ఇంకా ఇలాంటి వాళ్ల జాడ కనుక్కునే పనిలో పడ్డారు నిఘా అధికారులు.
అయితే కరుడు గట్టిన ఈ ఉగ్రవాదులను, ద్రేశద్రోహులను.. వాళ్ల కుటుంబ సభ్యులు మాత్రం వెనకేసుకు వస్తున్నారు. అమాయకులని చెబుతున్నారు. వాళ్లకేమీ తెలియదని, అలాంటివాళ్లు అసలే కాదని నమ్మబలుకుతున్నారు.
హైదరాబాద్లో భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్రలు పన్నిన వ్యవహారంలో సిరాజ్, సమీర్ లను కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేసి ఎన్ఐఏకు అప్పగించారు. జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు.. వాళ్ల దగ్గర నుంచి ఉగ్రవాద సమాచారం రాబట్టే ప్రయత్నాల్లో మునిగిపోయారు. ఇక, ఈ పేలుళ్ల కుట్రపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ దిమ్మదిరిగేలా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐసిస్ భావజాలానికి ఆకర్షితులై పేలుళ్లకు సిద్ధపడ్డారు సిరాజ్, సమీర్. ఏకంగా వీళ్లిద్దరూ కలిసే ఓ ఉగ్రవాద సంస్థను ప్రారంభించారు. తమ ఉనికిని చాటుకునేలా జనసాంద్రత ఎక్కువగా ఉన్నచోటే భారీ పేలుళ్లకు పాల్పడాలని కుట్ర పన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని ఆధారాలను సేకరిస్తున్నారు ఎన్ఐఏ అధికారులు. అయితే, ఇంత జరుగుతున్నా కూడా తన తమ్ముడు అమాయకుడని చెబుతోంది సమీర్ సోదరి ఆలియా. అతడికి లిఫ్ట్ను రిఫేర్ చేయడం తప్ప మరో విషయం తెలియదని అమాయకంగా చెబుతోంది.
మరోవైపు.. యూట్యూబ్ వీడియోల మాటున విదేశీ గూఢచర్యం చేస్తూ పట్టుబడింది జ్యోతి మల్హోత్రా అనే ట్రావెల్ యూట్యూబర్. పాక్ ఏజెంట్లతో డీల్స్ కుదుర్చుకుని దేశ రహస్యాలను అమ్మేసింది. ఈమె కేసును విచారించే కొద్దీ సంచలన విషయాలు బయట పడుతున్నాయి. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి వెనుక కూడా జ్యోతి మల్హోత్రా హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్తో తన యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రైబర్లనే కాదు.. పుట్టిన నేలనూ, కన్నవారినీ కూడా అడ్డంగా, నిలువునా మోసం చేసింది ఈ దేశద్రోహి జ్యోతి మల్హోత్రా. అయితే, ఇంత చేసినా తన కూతురిపై ఇసుమంతైనా అనుమానం రాలేదంటున్నాడు ఆమె తండ్రి హరీష్. ఆమె ఢిల్లీ వెళ్లి వస్తున్నట్టు తనకు తెలుసు తప్ప.. పాకిస్తాన్కు వెళ్లిన విషయమే తనకు తెలియదని చెబుతున్నాడు.
అయితే, జ్యోతి, సమీర్, సిరాజ్లే కాదు నిత్యం మనతోనే ఉంటూ మన మధ్యలోనే తిరుగుతూ మనపైనే, మన దేశం పైనే కుట్రలు చేస్తున్నారు అనేక మంది దేశద్రోహులు. మన మధ్యనే మన చుట్టూ ఉంటూ.. నిశ్శబ్దంగా ఎవరి పనులు, ఎవరి వ్యూహాలు, ఎవరి కుట్రలు వాళ్లు చేసుకుపోతున్నారు. అదను చూసి దేశంపై దాడికి దిగుతున్నారు. ఇదే క్రమంలో సైబర్ టెర్రరిస్ట్గా మారిన జాసిమ్ అన్సారీ అనే మరో కంత్రీగాడిని గుజరాజ్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో యాంటీ ఇండియా గ్రూపులో చేరి ప్రభుత్వ వెబ్సైట్ల్పై సైబర్ దాడులు చేశాడు ఈ దేశద్రోహి. ప్రస్తుతం ఇలాంటి ద్రోహుల జాడ కనిపెట్టే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. శత్రు దేశంతో చేతులు కలిపి దేశంలో కుట్రలు చేస్తున్న ఇలాంటివారిని వలవేసి పట్టుకుంటున్నారు.
