తొక్కిసలాటపై కర్నాటక ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు

బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్నాటక ప్రభుత్వం మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి కె.గోవిందరాజ్పై వేటు వేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ను బదిలీ చేసింది.
తొక్కిసలాట వ్యవహారంపై కన్నడ సర్కారు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ దుర్ఘటనకు బాధ్యులుగా భావిస్తున్న వాళ్లందరినీ ఏరి వేస్తోంది. కీలక స్థానాల్లో ఉన్న వారినీ వదిలిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే సిద్ధరామయ్య సర్కారు సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోవింద రాజ్, హేమంత్ నింబాల్కర్లపై చర్యలు తీసుకుంది.
చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సంఘటనపై కన్నడ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇప్పటికే బెంగళూరు నగర పోలీసు కమిషనర్తో పాటు మరికొందరు కీలక పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈమేరకు గురువారమే ఉత్తర్వులు వెలువడ్డాయి. అయినప్పటికీ.. ఈ చర్యలు తీసుకున్న మరుసటి రోజే, శుక్రవారం కూడా మరో ఇద్దరు ఉన్నతాధికారులపైనా ప్రభుత్వం వేటు వేయడం చర్చనీయాంశమయ్యింది.
