Kiran Mazumdar-Shah : కిరణ్ మజుందార్ షా: రోడ్ల సమస్య తర్వాత చెత్త సమస్యపై వైరల్ పోస్టు
రోడ్ల సమస్య తర్వాత చెత్త సమస్యపై వైరల్ పోస్టు

Kiran Mazumdar-Shah: ప్రముఖ ఔషధ సంస్థ బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఇటీవల బెంగళూరు రోడ్ల పరిస్థితిపై ఒక పోస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె భారతదేశంలో చెత్త నిర్వహణ సమస్యపై చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముంబయి, దిల్లీ, బెంగళూరు లాంటి మహానగరాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించడంపై ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో చెత్త సమస్య ఎంతో తీవ్రమైందని ఆమె గురువారం ఎక్స్ ప్లాట్ఫామ్లో పోస్టు చేశారు. పెద్ద నగరాల మున్సిపాల్టీలు కూడా దీన్ని సరిగా నిర్వహించలేకపోతున్నాయని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందౌర్, సూరత్, ముంబయి, దిల్లీ, బెంగళూరు వంటి నగరాలను ఆమె ఉదాహరణగా పేర్కొన్నారు. ఇది చాలా దారుణమైన స్థితి అని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలకు ఇలాంటి విషయాలపై అవగాహన లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యం దీనికి కారణమని ఆమె విమర్శించారు. ముంబయి బాంద్రా ప్రాంతంలో చెత్త పడి ఉన్న ఫోటోను పోస్టు చేసిన జర్నలిస్టు సుచేతా దలాల్ పోస్టుకు స్పందిస్తూ మజుందార్ షా ఈ వ్యాఖ్యలు చేశారు.
గత కొన్ని రోజులుగా బెంగళూరు రోడ్ల సమస్యపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మజుందార్ షా చేసిన మరో పోస్టు కూడా వైరల్ అయింది. బయోకాన్ పార్కుకు వచ్చిన ఒక విదేశీ అతిథి.. నగర రోడ్లు, చెత్త సమస్యలపై చేసిన వ్యాఖ్యలతో తాను సిగ్గుపడ్డానని ఆమె తెలిపారు. ఎందుకు ఇలాంటి సమస్యలను పరిష్కరించలేకపోతున్నారో అర్థం కావడం లేదని ఆ అతిథి అన్నారని ఆమె పేర్కొన్నారు. ఈ పోస్టుపై కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే స్పందించారు. బెంగళూరులో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, మౌలిక వసతుల కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు.
