రాజ్యసభకు నీతీశ్, సీఎం పదవికి రాజీనామా సంకేతాలు

ఎన్‌డీఏ కూటమి బలంతో 4-5 సీట్లు ఖాయం.. నామినేషన్లు దాఖలు చేస్తున్న నీతీశ్, నితిన్ నబీన్.. అమిత్ షా హాజరు


Bihar CM Nitish Kumar: బిహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడు నీతీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆయన సీఎం పదవికి త్వరలో రాజీనామా చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

గురువారం (మార్చి 5, 2026) పట్నాలో నీతీశ్ కుమార్, భాజపా జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరవుతారు. బిహార్‌లో రాజ్యసభకు ఐదు సీట్లకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్‌డీఏ కూటమి బలం బాగా ఉంది. అసెంబ్లీలో ఎన్‌డీఏకు 202 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒక రాజ్యసభ సీటు గెలవాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన ఎన్‌డీఏ కూటమికి నాలుగు నుంచి ఐదు సీట్లు దక్కే అవకాశం ఉంది.

గత నవంబరు 20న నీతీశ్ కుమార్ పదోసారి బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన ఘనత ఆయనదే. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కానీ, నాలుగు నెలల్లోనే ఆయన సీఎం పదవి నుంచి వైదొలగనున్నారు. దీంతో వారసుడెవరనే చర్చ మొదలైంది.

నీతీశ్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. త్వరలో జేడీయూ ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తుందని రాష్ట్ర మంత్రి శ్రవణ్ కుమార్ ఇప్పటికే వెల్లడించారు. నిశాంత్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవచ్చని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నీతీశ్ కుమార్ కూడా కుమారుడు రాజకీయాల్లోకి రావడానికి అంగీకరించారు.

బుధవారం జేడీయూ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఝా దిల్లీ నుంచి పట్నాకు వచ్చి నీతీశ్‌తో సుదీర్ఘంగా చర్చించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలు, సీఎం మార్పు అంశాలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story