Major Setback for Maoists: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా మరో 50 మంది పోలీసుల అదుపులో ఉన్నారని, వారిని కోర్టులో హాజరుపరచాలని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డీకేఎస్‌జడ్‌సీ) గురువారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 22వ తేదీతో ఉన్న ఈ ప్రకటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది. డీకేఎస్‌జడ్‌సీ కార్యదర్శి వికల్ప్ పేరిట వెలువడిన ఈ ప్రకటనలో హిడ్మా ఎన్‌కౌంటర్‌తో పాటు బూటకపు ఎన్‌కౌంటర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు.

మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్‌జీ సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారిని తక్షణం కోర్టులో హాజరుపరచాలని డీకేఎస్‌జడ్‌సీ డిమాండ్ చేసింది. ఈ ప్రకటనలో హిడ్మా ఎన్‌కౌంటర్‌ను ప్రస్తావించారు. నవంబరు 18న ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి అడవుల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో హిడ్మా సహా ఆరుగురు మరణించారని ఆరోపించారు. అదే రోజు 19న అక్కడే సురేశ్, శంకర్ సహా మరో ఏడుగురిని బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపారని కూడా పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ల సమయంలోనే దేవ్‌జీ సహా 50 మందిని వివిధ ప్రాంతాల నుంచి అదుపులోకి తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.

సెప్టెంబర్ 21న కోసాదాదా, రాజుదాదాలను కూడా బూటకపు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా నవంబరు 30న ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్య ప్రాంతంలో బంద్‌ను విజయవంతం చేయాలని ప్రకటనలో పిలుపునిచ్చారు. గిరిజనుల రాజ్యాంగ హక్కులను విస్మరిస్తూ దండకారణ్య మొత్తం సైనిక కంటోన్‌మెంట్‌గా మారిందని, కార్పొరేట్ గనుల కోసం లక్షల చెట్లను నరికి వేస్తున్నారని, అభయారణ్యాల పేరుతో స్థానికులను నిర్వాసితులను చేయడానికి నోటీసులు జారీ చేస్తున్నారని మండిపడ్డారు.

ఈ ప్రకటన మావోయిస్టు పార్టీ పోలీసుల చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. దేవ్‌జీల పోలీసు అదుపు విషయం రాష్ట్ర భద్రతా సంస్థల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఈ ఎన్‌కౌంటర్లు మావోయిస్టు ప్రభావాన్ని తగ్గించడానికి పోలీసులు చేపట్టిన చర్యల విజయంగా చెబుతున్నారు.

Next Story