Mamata Banerjee: ఈసీని భాజపా నడుపుతోంది: మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు

Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భాజపా తెరవెనుక ఉండి ఈసీని నడుపుతోందని, ఇప్పుడు ప్రజలందరికీ అర్థమైపోయిందని మండిపడ్డారు.
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈసీ అధికారిక పత్రంపై భాజపా రబ్బరు స్టాంపు కనిపించడం వివాదానికి దారితీసింది. ఈ విషయం సోమవారం బయటపడగా, ఎన్నికల సంఘం దీన్ని ‘మానవ తప్పిదం’ అని వివరించింది. అయితే మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యను తోసిపుచ్చారు.
“ఇది సాధారణ మానవ తప్పిదం కాదు. రాజకీయ కుట్రతో చేసిన పని. దేశంలో ఏకపక్ష పాలనను రుద్దడానికి ఈసీ మద్దతు ఇస్తోంది” అని మమతా ఆరోపించారు.
మంగళవారం కోల్కతా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన మమతా, ఈ ఘటనపై అన్ని పార్టీలు ఏకమై ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ ఆరోపణలపై ఎన్నికల సంఘం ఇంకా మరిన్ని వివరాలు ఇవ్వలేదు. ఈ వివాదం దేశవ్యాప్తంగా రాజకీయ చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

