Trinamool Congress President: తృణమూల్ అధ్యక్షురాలుగా మమతా బెనర్జీ తొలగింపు
మమతా బెనర్జీ తొలగింపు

Trinamool Congress President: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీకి రెబల్ గ్రూపు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించింది. అంతేకాకుండా మమతా మద్దతుదారుల్లో మరింత మంది తమ వైపు మొగ్గుచూపుతున్నట్లు రెబల్ నాయకులు వెల్లడించారు.
పశ్చిమ బెంగాల్లో సోమవారం రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం కోల్కతా న్యూటౌన్లో రెబల్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఈ భేటీలో దాదాపు 500 మంది జిల్లా అధ్యక్షులు, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సమావేశంలో మమతా బెనర్జీని అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రతిపక్ష నేత రితబ్రత బెనర్జీ ప్రకటించారు.
30 మంది సభ్యులతో కొత్త జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే అరూప్ రాయ్ను ఛైర్పర్సన్గా ఎన్నిక చేశారు. తమదే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని స్పష్టం చేస్తూ, ఈ నిర్ణయాన్ని ఎన్నికల సంఘానికి తెలియజేస్తామని రితబ్రత బెనర్జీ వెల్లడించారు. మమతా బెనర్జీ ప్రధాన సలహాదారుగా ఉండాలనుకుంటే స్వాగతించడాని పేర్కొన్నారు.
సమావేశంలో తృణమూల్ ఎన్నికల గుర్తును కొనసాగించాలని నిర్ణయించారు. మమతా, అభిషేక్ బెనర్జీ చిత్రాలను తొలగించారు. ఫర్హాద్ హకీం, అరూప్ బిశ్వాస్, రథిన్ ఘోష్, సబీనా యాస్మిన్లను ఉపాధ్యక్షులుగా, రితబ్రత బెనర్జీ, జావేద్ ఖాన్, సందీపన్ సాహాలను ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
మమతా బెనర్జీకి కీలక అనుచరుడైన కోల్కతా మాజీ మేయర్ ఫర్హాద్ హకీం కూడా రెబల్ గ్రూపులో చేరినట్లు రితబ్రత బెనర్జీ తెలిపారు. ఈ పరిణామాలు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

