కేరళ తీరంలో సింగపూర్ నౌకలో భారీ పేలుడు.. రంగంలోకి భారత నౌకాదళం
Massive explosion on Singapore ship off Kerala coast.. Indian Navy enters the scene

కేరళ తీరానికి సమీపంలో సముద్రంలో ఓ కంటెయినర్ నౌకలో భారీ పేలుడు సంభవించింది. ఆ కంటెయినర్ నౌక మీద సింగపూర్ జెండా ఉండటంతో.. అది సింగపూర్ నౌకగా నిర్థారించారు. ఎంవీ వాన్ హై-503 భారీ కంటెయినర్ నౌకలో సోమవారం ఉదయం ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో, ఆ నౌకలో ఉన్న సిబ్బంది తీవ్ర భయాందోళన చెందారు. నౌకలో పేలుడుకు సంబంధించిన సమాచారం అందుకున్న భారత నావికా దళం వెంటనే స్పందించింది. ఆ నౌకలో ఉన్న వాళ్లను రక్షించేందుకు రంగంలోకి దిగింది.
ఇవాళ ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ సంఘటన చోటు చసుకుంది. నౌక లోపలి భాగంలో పేలుడు చోటు చేసుకుంది. దీంతో, ఆ నౌక నుంచి భారీగా పొగలు వెలువడ్డాయి. తక్షణమే సహాయకచర్యలు అందించేందుకు ఐఎన్ఎస్ సూరత్ యుద్ధనౌకను భారత నౌకాదళం ఘటనాస్థలానికి పంపించింది. అంతేకాకుండా.. కొచ్చిన్లోని నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్ఎస్ గరుడ్ నుండి డోర్నియర్ నిఘా విమానాన్ని పంపించింది. సింగపూర్ నౌక ఉన్న ప్రాంతంలో గగనతల పర్యవేక్షణ చేస్తున్నారు. నౌకలోని సిబ్బంది భద్రత, నౌక పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
కేరళ తీరానికి సమీపంలో పేలుడు సంభవించిన ఎంవీ వాన్ హై 503 నౌక.. సుమారు 270 మీటర్ల పొడవున్న భారీ కంటైనర్ రవాణా నౌక. ఈ నౌక జూన్ 7వ తేదీన శ్రీలంకలోని కొలంబో ఓడరేవు నుంచి బయలుదేరింది. షెడ్యూల్ ప్రకారం, జూన్ 10వ తేదీకి ముంబైకి చేరుకోవాల్సి ఉంది. మార్గమధ్యంలో కేరళ తీరానికి సమీపంలో ఉండగా ఈ పేలుడు సంభవించింది.
