రక్షణ, వాణిజ్య సహకారాలపై దృష్టి

Modi’s Israel Visit: భారత్-ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, రక్షణ రంగంలో సహకారాన్ని విస్తరించడం, వాణిజ్య ఒప్పందాలను పెంచడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్‌కు పర్యటించనున్నారు.

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించిన నేపథ్యంలో, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇజ్రాయెల్ పార్లమెంట్ (క్నెసెట్)లో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో విస్తృత స్థాయి చర్చలు జరపనున్నారు. అలాగే ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో కూడా సమావేశమవుతారు.

రక్షణ, భద్రతా రంగాల్లో సహకారం, సాంకేతికత బదలాయింపు, వాణిజ్య ఒప్పందాలపై ఇరు దేశాల ప్రతినిధులు లోతైన చర్చలు నడపనున్నారు. బుధవారం రాత్రి నెతన్యాహు ఏర్పాటు చేసే వ్యక్తిగత విందులో మోదీ పాల్గొంటారు.

గత తొమ్మిదేళ్లలో ఇది మోదీ ఇజ్రాయెల్ పర్యటన రెండోసారి. గతంలో 2017 జులైలో ఆయన ఇజ్రాయెల్‌ను సందర్శించారు. అదే విధంగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు 2018 జనవరిలో భారతదేశానికి వచ్చారు. ఈ సందర్భంగా గాజా పరిస్థితులు, పశ్చిమాసియాలోని ఇతర ముఖ్య అంశాలపై ఇరువురు నాయకులు చర్చించే అవకాశం ఉంది.

ఇజ్రాయెల్‌లో ప్రస్తుతం సుమారు 41 వేల మంది ప్రవాస భారతీయులు నివసిస్తున్నారు. వారితో ప్రధాని మోదీ సంభాషణ జరిపే అవకాశం కూడా ఉంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story