ముఖేష్ అంబానీ ఎందుకిచ్చారంటే ?

Mukesh Ambani : ఆసియాలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT), ముంబై కి రూ.151 కోట్ల భారీ విరాళాన్ని అందజేశారు. ఐసీటీ చరిత్రలో ఇది అతిపెద్ద విరాళం కావడం విశేషం. ముకేశ్ అంబానీ 1970లలో ఇదే సంస్థలో చదువుకున్నారు. అప్పట్లో దీనిని యూనివర్సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (UDCT) గా పిలిచేవారు. UDCT ను 1933లో ముంబై విశ్వవిద్యాలయం స్థాపించగా, 2008లో దీనికి ICT అని పేరు మార్చారు. అప్పటి నుంచి ఇది డీమ్డ్ యూనివర్సిటీగా కొనసాగుతోంది.

అనితా పాటిల్ రచించిన 'ద డివైన్ సైంటిస్ట్' (The Divine Scientist) పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అంబానీ ICT కి ఈ విరాళాన్ని ప్రకటించారు. ఈ పుస్తకం పద్మ విభూషణ్ ప్రొఫెసర్ మన్ మోహన్ శర్మ జీవితం ఆధారంగా రాశారు. ప్రొఫెసర్ శర్మను భారతీయ కెమికల్ ఇంజనీరింగ్‌కు ఒక గొప్ప గురువుగా భావిస్తారు. గురుదక్షిణ సంప్రదాయంలో భాగంగా..ప్రొఫెసర్ శర్మ ఆదేశం మేరకు ICT కి రూ.151 కోట్ల విరాళం ఇవ్వాలని అంబానీ నిర్ణయించారు. ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ.. "ఈ విరాళాన్ని ప్రొఫెసర్ శర్మకు అంకితం చేస్తున్నానని ప్రకటించడానికి నేను సంతోషిస్తున్నాను" అని తెలిపారు.

అంబానీ UDCT క్యాంపస్‌కు రావడం ఒక పవిత్రమైన అనుభవంగా అభివర్ణించారు. ప్రొఫెసర్ శర్మను తన మార్గదర్శకుడిగా అభివర్ణించారు. అనితా పాటిల్‌ను అభినందిస్తూ అలాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని రాయడం సులభమైన పని కాదని ఆయన అన్నారు. తాను ఐఐటీ బాంబే (IIT Bombay) కాకుండా UDCT ని ఎందుకు ఎంచుకున్నారో ముకేశ్ అంబానీ గుర్తు చేసుకున్నారు. ప్రొఫెసర్ శర్మ మొదటి ఉపన్యాసం విన్న తర్వాత తన నమ్మకం మరింత బలపడిందని ఆయన చెప్పారు. భారతీయ కెమికల్ పరిశ్రమ అభివృద్ధికి ప్రొఫెసర్ శర్మ చేసిన కృషిని అంబానీ ప్రశంసిస్తూ ఆయనను 'రాష్ట్ర గురువు' (Rashtra Guru) అని అభివర్ణించారు. ముకేశ్ అంబానీ ఇచ్చిన ఈ భారీ విరాళం, తన గురువు పట్ల ఆయనకు ఉన్న అపారమైన గౌరవాన్ని, తన విద్యా సంస్థపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది. ఇది భారతదేశంలో విద్యాభివృద్ధికి, పరిశోధనలకు మరింత ఊతం ఇస్తుంది.

PolitEnt Media

PolitEnt Media

Next Story