Gig Workers’ Strike: ఆదాయాలు పెంచాలని, మెరుగైన పని పరిస్థితులు, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ దేశవ్యాప్తంగా గిగ్‌ వర్కర్లు జనవరి 1వ తేదీ బుధవారం నాడు సమ్మె చేశారు. తెలంగాణ గిగ్‌ అండ్‌ ప్లాట్‌ఫాం వర్కర్స్‌ యూనియన్‌ (టీజీపీడబ్ల్యూయూ)తో పాటు ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ యాప్‌ బేస్డ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ (ఐఎఫ్‌ఏటీ) సంయుక్త పిలుపుపై ఈ సమ్మె జరిగింది.

అయితే ఈ సమ్మెకు ఊహించినంత స్పందన లభించలేదు. యూనియన్ల నాయకులు మాత్రం తమ సభ్యుల్లో ఎక్కువ మంది పనికి హాజరుకాకుండా దూరంగా ఉన్నారని చెప్పారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ, ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై సమ్మె ప్రభావం గణనీయంగా కనిపించలేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గిగ్‌ వర్కర్లు నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

ఈ సమ్మెకు ఏఐటీయూసీ సంఘం మద్దతు ప్రకటించింది. గిగ్‌ వర్కర్లను కూడా ఫ్యాక్టరీ కార్మికుల్లాగా గుర్తించి హక్కులు కల్పించాలని డిమాండ్‌ చేసింది.

సమ్మె ప్రభావాన్ని తగ్గించేందుకు పలు ప్లాట్‌ఫామ్‌లు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రకటించాయి. జొమాటో సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుంచి రూ.150 వరకు అదనంగా చెల్లిస్తామని హామీ ఇచ్చింది. దీనితో రోజుకు రూ.3 వేల వరకు సంపాదన ఉంటుందని, ఆర్డర్‌ రద్దు లేదా తిరస్కరణలపై జరిమానాలు విధించబోమని పేర్కొంది.

అలాగే స్విగ్గీ కూడా చెల్లింపులను పెంచింది. డిసెంబరు 31, జనవరి 1 తేదీల మధ్య డెలివరీ పార్టనర్లు రూ.10 వేల వరకు ఆర్జించవచ్చని సంస్థ వర్గాలు తెలిపాయి.

PolitEnt Media

PolitEnt Media

Next Story