Rajyasabha : నలుగురు ప్రముఖులను రాజ్యసభకు నామినేట్ చేసిన రాష్ట్రపతి
రాజ్యసభకు ఎంపికైన ఉజ్వల్ నికమ్, హర్షవర్ధన్ ష్రింగ్లా, సదానంద్ మాస్తే, మీనాక్షీ జైన్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నలుగురు దేశ ప్రముఖులను నామినేట్ చేశారు. కానిస్టిట్యూషన్ లోని క్లాజ్ త్రీలో ఉన్న ఆర్టికల్ 80(1)(ఎ) ద్వారా రాష్ట్రపతికి దఖలు పరచిన అధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి నలుగురు విశిష్ట వ్యక్తులను రాజ్యసభకు నామినేట్ చేశారు. గతంలో రాష్ట్రపతి నామినేట్ చేసిన రాజ్యసభ సభ్యుల పదవీ కాలం పూర్తవడంతో వివిధ రంగాల్లో ప్రముఖులైన నలుగురు వ్యక్తులను రాష్ట్రపతి కొత్తగా నామినేట్ చేశారు. వీరిలో 2008 నవంబర్ 26వ తేదీన ముంబై నగరంపై ఉగ్రదాడి జరిగిన కేసుతో పాటు అనేక కీలక క్రిమినల్ కేసులను ప్రభుత్వం తరపున వాదించిన ప్రఖ్యాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావు నికమ్ ను రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రముఖ విద్యావేత్త, కొన్ని దశాబ్ధాలుగా అట్టడుగు వర్గాలకు, పేద, బడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన సి.సదానందన్ మాస్తే, భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా అనేక పదవులు నిర్వర్తించిన దౌత్యవేత్త హర్షవర్ధన్ ష్రింగ్లాలను కూడా రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేశారు. వీరి ముగ్గురితో పాటు చరిత్రకారిణి, రాజకీయ శాస్త్రవేత్త, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్ట్ సభ్యురాలు, కులం, రాజకీయాలు మధ్య సంబంధాలపై పరిశోధనలు చేసిన మీనాక్షీ జైన్ ను కూడా రాజ్యసభకు నామినేట్ చేశారు. మీనాక్షీ జైన్ ప్రస్తుతం ఢిల్లీలోని గార్గి కళాశాలలో చిరిత్ర విభాగానికి అసోసియేట్ ప్రొఫెసరగ్ పనిచేస్తున్నారు. సాహిత్యం, కళలు, సామాజిక సేవ, సైన్స్ తదిరత రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారిని రాజ్యసభకు నామినేట్ చేసే అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నలుగురిని రాజ్యసభకు నామినేట్ చేశారు.
