అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం

Maharashtra Deputy CM Ajit Pawar: మహారాష్ట్రలో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మృతి చెందారు. బుధవారం ఉదయం ముంబయి నుంచి బారామతి వెళ్తుండగా ఆయన ప్రయాణించిన విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఈ దారుణ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు విమానంలోని మరో నలుగురు (పైలట్, క్రూ సభ్యుడు, భద్రతా అధికారి, సిబ్బండి) ప్రాణాలు కోల్పోయారు.

జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం బారామతి వెళ్తున్న అజిత్ పవార్ విమానం ఉదయం 8.45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పి రన్‌వే పక్కన పడిపోయింది. ఆ తర్వాత విమానంలో భారీగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. సాంకేతిక లోపం, దట్టమైన పొగమంచు కారణంగా రెండోసారి ల్యాండింగ్ ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక వివరాలు తెలుస్తున్నాయి.

అజిత్ పవార్ (వయసు 66) నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) నాయకుడిగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక వ్యక్తి. శరద్ పవార్ బంధువు అయిన ఆయన గ్రామీణ సహకార ఉద్యమం ద్వారా బలమైన బేస్‌ను నిర్మించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఆయనకు ఉన్న ప్రభావం అపారం. ఈ ప్రమాదం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా దిగ్భ్రాంతి నెలకొంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో పాటు వివిధ రాజకీయ నాయకులు ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అజిత్ పవార్‌కు రాష్ట్ర గౌరవంతో బారామతిలో గురువారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రధానమంత్రి మోదీ, షా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు పబ్లిక్ హాలిడే ప్రకటించింది. మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రీయ దుఃఖదినంగా పాటించనుంది. ఈ ప్రమాదం కారణాలపై డీజీసీఏ, ఇతర అధికారులు లోతైన దర్యాప్తు చేపట్టనున్నారు.

ఈ దుర్ఘటన మహారాష్ట్ర రాజకీయాలకు తీరని నష్టం కలిగించింది. అజిత్ పవార్ కుటుంబానికి, ఎన్‌సిపి కార్యకర్తలకు, మహారాష్ట్ర ప్రజలకు సంతాపాలు.

PolitEnt Media

PolitEnt Media

Next Story