ఎన్సీపీ!

Sharad Pawar's NCP: మహారాష్ట్రలో శివసేన (యూబీటీ) చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా, తాజాగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ-ఎస్పీ కూడా చీలిక దిశగా పయనిస్తున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సీనియర్ నేతలు ఈ విషయాన్ని బాంబు పేల్చినట్లు వెల్లడించారు.
శరద్ పవార్ వర్గానికి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు సాగిస్తున్నట్లు ఎన్సీపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా ధర్మారావు ఆత్రం వెల్లడించారు. దీంతో రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఊహిస్తున్నాయి. అయితే, ఈ సంప్రదింపుల విషయాన్ని శరద్ పవార్ వర్గం ఎంపీలు ఇంతవరకు ధ్రువీకరించలేదు.
సంఖ్యాబలం ఎంత?
ప్రస్తుతం లోక్సభలో ఎన్సీపీ-ఎస్పీకి 8 మంది ఎంపీలు ఉన్నారు. రాజ్యసభలో ఒక్క ఎంపీ ఉన్నారు. చట్టబద్ధంగా పార్టీలో చీలిక జరగాలంటే లోక్సభలో మూడింట రెండు వంతుల మంది (ఆరుగురు) ఎంపీల మద్దతు అవసరం. శరద్ పవార్ వర్గ ఎంపీలుగా సుప్రియా సూలే, అమోల్ కొల్హే, భజరంగ్ సోనావనే, నీలేశ్ లంకే, సురేష్ మెహత్రే, అమర్ కలే, భాస్కర్ భాగరె, ధైర్యషీల్ మొహితే పాటిల్ ఉన్నారు.
శివసేన (యూబీటీ)లో ఇప్పటికే జరుగుతున్న అస్థిరతల నేపథ్యంలో ఎన్సీపీ-ఎస్పీపై కూడా అదే విధమైన ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ అభివృద్ధులు మహారాష్ట్ర రాజకీయ దృశ్యాన్ని మరింత ఆసక్తికరంగా మార్చనున్నాయి.

