Shashi Tharoor: కేరళ ఎన్నికల్లో పోటీ చేయను – ప్రచారంపై దృష్టి: ఎంపీ శశిథరూర్
ప్రచారంపై దృష్టి: ఎంపీ శశిథరూర్

Shashi Tharoor: కేరళలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కాబట్టి తాను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల నుంచి ఒకరిని పార్టీ సీఎంగా ఎంపిక చేసుకుంటుందని ఆయన వెల్లడించారు.
పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో థరూర్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రమంతా పర్యటించి కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు ఎదురుచూస్తున్నాను. కేరళలో పార్టీకి విస్తృత పట్టు ఉంది. అందుకే సీఎం అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం లేదు’’ అని తెలిపారు.
పార్టీ వైపు నుంచి కొన్ని తప్పులు జరిగినందునే రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో బలమైన పోటీ చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తామని థరూర్ విశ్వాసం వ్యక్తం చేశారు.

