తమిళనాడు డీజీపీ స్పందన

Tamil Nadu DGP: కరూర్‌లో సినీనటుడు, టీవీకే పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ ర్యాలీలో 10,000 మంది పాల్గొంటారనే అంచనాలతో పర్మిషన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని తమిళనాడు డీజీపీ జి. వెంకట్రామన్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ దుర్ఘటనకు కారణాలను తెలిపారు.

‘‘విజయ్ పార్టీ నాయకులు కేవలం 10,000 మందితో ర్యాలీ (టీవీకే ర్యాలీ తొక్కిసలాట) నిర్వహించడానికి మాత్రమే అనుమతులు కోరారు. కానీ, ఆ సంఖ్యకు మించి అభిమానులు వస్తారని మేము అంచనా వేశాం. దీనికి తోడు టీవీకే సోషల్ మీడియాలో విజయ్ వాస్తవంగా వచ్చిన సమయం కంటే చాలా ముందుగా మధ్యాహ్నం 3 గంటలకే వస్తారని ప్రకటించారు. కానీ రాత్రి 7.30కి వచ్చారు. దీంతో ఆ ప్రదేశంలో భారీగా అభిమానులు చేరుకుని ఎదురు చూశారు. అధికారులు ఈ కార్యక్రమానికి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. గతంలో అన్నాడీఎంకే ర్యాలీ అక్కడ జరిగింది. ఘటనా స్థలానికి వెంటనే 2,000 మంది సిబ్బందిని సీనియర్ పోలీసు అధికారులను పంపించాం. ఏక సభ్య కమిషన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది’’ అని డీజీపీ వెల్లడించారు.

విజయ్ సహాయకులపై కేసు

కరూర్‌లో తొక్కిసలాటకు సంబంధించి సినీనటుడు విజయ్‌కు చెందిన ఇద్దరు సహాయకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. పార్టీ (టీవీకే) ప్రధాన కార్యదర్శి ఆనంద్, జాయింట్ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ ఏడీజీపీ ఎస్ డేవిడ్‌సన్ ధ్రువీకరించారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

మృతుల కుటుంబాలకు చిరంజీవి సంతాపం

కరూర్‌లో జరిగిన తొక్కిసలాటపై ప్రముఖ సినీనటుడు చిరంజీవి ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘కరూర్‌లో జరిగిన ర్యాలీలో చోటు చేసుకున్న తొక్కిసలాటపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మృతులకు సంతాపం తెలుపుతున్నాను. బాధితుల కుటుంబీకులు ఈ కష్ట సమయంలో దృఢంగా ఉండాలి. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

PolitEnt Media

PolitEnt Media

Next Story